నేను ఓడిపోయినప్పుడు ఆయన నాకు అండగా నిలబడ్డారు: పవన్ కల్యాణ్
- కర్ణాటకలో జస్టిస్ గోపాల గౌడ అమృత మహోత్సవం
- వేడుకలకు హాజరైన పవన్ కల్యాణ్
- రాజకీయాల్లో ఓడినప్పుడు తన భుజం తట్టి ధైర్యం చెప్పారని వెల్లడి
- జనసేన సిద్ధాంతాలకు గౌడ బలమైన మద్దతుదారుడన్న పవన్
- నల్లమల, భూసేకరణ పోరాటాల్లో ఆయన దిశానిర్దేశం చేశారని కితాబు
జనసేన పార్టీ సిద్ధాంతాలను, విలువలను జస్టిస్ గోపాల గౌడ ఎంతగానో గౌరవిస్తారని పవన్ తెలిపారు. గతంలో భూసేకరణ చట్టం, నల్లమల యురేనియం తవ్వకాలు వంటి అంశాలపై జనసేన చేసిన పోరాటాల్లో ఆయన పాల్గొని దిశానిర్దేశం చేశారని గుర్తు చేశారు. ఆ స్ఫూర్తే తమ పోరాటానికి బలమైందన్నారు. గత ప్రభుత్వ హయాంలో మూడు రాజధానుల ఆలోచనపై కూడా ఆయన న్యాయపరమైన అంశాలను నిక్కచ్చిగా వివరించారని చెప్పారు.
కార్మికుడికి ఉద్యోగం అంటే కేవలం జీతం కాదని, అది అతని గౌరవం, భద్రత అని చాటిచెప్పిన మహనీయుడు జస్టిస్ గోపాల గౌడ అని పవన్ ప్రశంసించారు. అక్రమంగా తొలగించిన కార్మికుడికి పరిహారం కాకుండా, తిరిగి ఉద్యోగం కల్పించాలని హైకోర్టు తీర్పును తోసిపుచ్చుతూ ఆయన ఇచ్చిన తీర్పును ఈ సందర్భంగా గుర్తు చేశారు.
తాను ఉపముఖ్యమంత్రి అయిన తర్వాత జస్టిస్ గోపాల గౌడ ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారని పవన్ వెల్లడించారు. ఆయన వంటి మహానుభావుల సహకారం, పరిచయం జనసేన పార్టీకి, రాబోయే తరాల భవిష్యత్తుకు పెద్ద అండ అని పేర్కొన్నారు.