సీఎం చంద్రబాబు చేతుల మీదుగా రేపు స్వచ్ఛతా అవార్డులు
- స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా రేపు అవార్డుల ప్రదానం
- విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో కార్యక్రమం
- ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా పురస్కారాల అందజేత
- మొత్తం 21 కేటగిరీల్లో ఉత్తమ సంస్థలు, వ్యక్తులకు గుర్తింపు
- రాష్ట్రస్థాయిలో 69, జిల్లా స్థాయిలో 1,257 అవార్డుల పంపిణీ
- పారిశుద్ధ్య కార్మికులు, స్వయం సహాయక సంఘాలకు కూడా సత్కారం
ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రస్థాయి నుంచి గ్రామస్థాయి వరకు పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇచ్చిన వారిని ప్రభుత్వం గుర్తించనుంది. మొత్తం 21 కేటగిరీలలో ఈ పురస్కారాలను అందిస్తుండగా, రాష్ట్ర స్థాయిలో 69 అవార్డులను ముఖ్యమంత్రి స్వయంగా ప్రదానం చేస్తారు. ఇక జిల్లా స్థాయిలో మరో 1,257 అవార్డులను విజేతలకు అందించనున్నారు. స్వచ్ఛ మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలతో పాటు స్వచ్ఛ పాఠశాలలు, ఆసుపత్రులు, ప్రభుత్వ కార్యాలయాలు, రైతు బజార్లు, బస్ స్టేషన్లు, పరిశ్రమల విభాగాల్లో ఈ పురస్కారాలను ఎంపిక చేశారు.
రాష్ట్రస్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 6 మున్సిపాలిటీలు, 6 గ్రామ పంచాయతీలు సీఎం చేతుల మీదుగా అవార్డులు అందుకోనున్నాయి. మంగళగిరి-తాడేపల్లి కార్పొరేషన్తో పాటు తాడిపత్రి, బొబ్బిలి, పలమనేరు, ఆత్మకూరు, కుప్పం మున్సిపాలిటీలు ఎంపికయ్యాయి. గ్రామ పంచాయతీల విభాగంలో అనకాపల్లి జిల్లా చౌడువాడ, ప్రకాశం జిల్లా ఆర్ఎల్ పురం, కోనసీమ జిల్లా లోల్ల, కృష్ణా జిల్లా చల్లపల్లి, కడప జిల్లా చెన్నూరు, చిత్తూరు జిల్లా కనమకులపల్లెలు ఈ పురస్కారాలకు ఎంపికయ్యాయి.
క్షేత్రస్థాయిలో స్వచ్ఛతకు పెద్దపీట వేసిన పారిశుద్ధ్య కార్మికులు, గ్రీన్ అంబాసిడర్లు, స్వయం సహాయక సంఘాల సేవలను కూడా ప్రభుత్వం గుర్తించింది. వారికి సైతం ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ కార్యక్రమంలో అవార్డులు అందించి సత్కరించనున్నారు.