కేబీసీలో 50 లక్షలు గెల్చుకున్న మహారాష్ట్ర రైతు
- కేబీసీ కోసం 2018 నుంచి సిద్ధమైనట్లు వెల్లడి
- ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ షోలో అమితాబ్ అడిగిన 14 ప్రశ్నలకు సరైన జవాబులు
- కోటి రూపాయల ప్రశ్నకు జవాబు చెప్పలేక పోటీ నుంచి విరమణ
మహారాష్ట్రకు చెందిన కైలాశ్ కుంటేవార్ తన కేబీసీ అనుభవం గురించి మీడియాతో మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచి తాను చదువులో ముందుండే వాడినని చెప్పారు. కేబీసీ షో వినోదం కోసమేనని భావించేవాడినని, 2018లో ఈ షోలో డబ్బు గెల్చుకున్న వ్యక్తితో మాట్లాడాక సీరియస్ గా దీనిపై దృష్టి సారించానని చెప్పారు. అప్పటి నుంచి కేబీసీ కోసం ప్రత్యేకంగా సిద్ధమైనట్లు వెల్లడించారు. రోజంతా పొలంలో కష్టపడ్డా ఇంటికి వచ్చాక కనీసం ఒక గంటపాటు కేబీసీ కోసం ప్రిపేర్ అయినట్లు కైలాశ్ తెలిపారు.
షోలో అమితాబ్ అడిగిన ప్రశ్నలకు వరుసగా సరైన జవాబులు చెబుతూ 50 లక్షలు గెల్చుకున్నానని, కోటి రూపాయల ప్రశ్న విషయంలో కొంత సందిగ్ధం నెలకొందని చెప్పారు. దీంతో రిస్క్ తీసుకోలేక అప్పటి వరకు గెల్చుకున్న 50 లక్షలతో పోటీ నుంచి తప్పుకున్నట్లు కైలాశ్ వివరించారు. తాను గెల్చుకున్న సొమ్మును ఖర్చు చేసే విషయంలో పిల్లల చదువులకే ప్రథమ ప్రాధాన్యమిస్తానని కైలాశ్ తెలిపారు.