దసరా వేదికగా జగ్గారెడ్డి కీలక ప్రకటన.. వచ్చే ఎన్నికల బరిలోకి ఆయన భార్య నిర్మల!
- వచ్చే ఎన్నికల్లో సంగారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా నిర్మలా జగ్గారెడ్డి
- నియోజకవర్గ బాధ్యతలు ఇకపై నిర్మలకేనని స్పష్టీకరణ
- సంగారెడ్డి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా కూన సంతోష్
- సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి పనులు చేయిస్తానని హామీ
- యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచన
సంగారెడ్డిలోని అంబేద్కర్ స్టేడియంలో గురువారం నిర్వహించిన దసరా వేడుకల్లో జగ్గారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భవిష్యత్తు రాజకీయాలపై తన వైఖరిని స్పష్టం చేశారు. "నన్ను మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు, నా శక్తి మేరకు నియోజకవర్గానికి సేవ చేశాను. ఇకపై సంగారెడ్డి నియోజకవర్గ పూర్తి బాధ్యతలను నిర్మల చూసుకుంటారు" అని దసరా వేదిక నుంచే ప్రకటించారు. అంతేకాకుండా, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో సంగారెడ్డి చైర్మన్ అభ్యర్థిగా కూన సంతోష్ పేరును కూడా ఆయన వెల్లడించారు.
తాను తెరవెనుక ఉండి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని జగ్గారెడ్డి హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి సంగారెడ్డికి కావాల్సిన అన్ని పనులనూ మంజూరు చేయిస్తానని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా యువతకు ఆయన ప్రత్యేకంగా సూచనలు చేశారు. గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు బానిసలై జీవితాలను నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. అతివేగంగా వాహనాలు నడిపి ప్రమాదాల బారిన పడి తల్లిదండ్రులకు కడుపుకోత మిగల్చవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.