దసరా ఎఫెక్ట్... హైదరాబాద్-విజయవాడ హైవేపై పెరిగిన రద్దీ
- దసరా సెలవులతో ఊరి బాటపట్టిన హైదరాబాద్ వాసులు
- సొంతూళ్లకు జనం.. వాహనాలతో కిక్కిరిసిన జాతీయ రహదారి
- పంతంగి టోల్ ప్లాజా వద్ద నెమ్మదిగా కదులుతున్న వాహనాలు
- చౌటుప్పల్, పెద్దకాపర్తి, చిట్యాల వద్ద అధిక రద్దీ
- ప్రయాణికులతో కిటకిటలాడుతున్న నగరంలోని ప్రధాన బస్టాండ్లు
ముఖ్యంగా యాదాద్రి భువనగిరి జిల్లాలోని పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాలు కిలోమీటర్ల మేర బారులు తీరాయి. వాహనాలు నెమ్మదిగా కదలడంతో ప్రయాణ సమయం పెరిగిపోతోంది. చౌటుప్పల్, పెద్దకాపర్తి, చిట్యాల వంటి ప్రాంతాల్లోనూ అధిక రద్దీ కనిపిస్తోంది. సొంత కార్లు, ఇతర ప్రైవేట్ వాహనాల్లో ప్రజలు భారీగా బయలుదేరడమే ఈ రద్దీకి ప్రధాన కారణంగా కనిపిస్తోంది.
మరోవైపు, నగరంలోని ప్రధాన బస్ స్టేషన్లు కూడా ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. పండుగ కోసం ప్రభుత్వం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినప్పటికీ, ప్రయాణికుల సంఖ్య అధికంగా ఉండటంతో బస్టాండ్లన్నీ జనంతో నిండిపోయాయి. సొంత వాహనాల్లో వెళ్లేవారు, బస్సుల్లో ప్రయాణించేవారితో హైదరాబాద్ నుంచి బయటకు వెళ్లే అన్ని మార్గాల్లోనూ పండుగ సందడితో పాటు ట్రాఫిక్ రద్దీ నెలకొంది.