శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం.. వాహన సేవల పూర్తి వివరాలు ఇవే!
- ధ్వజారోహణంతో ఘనంగా ప్రారంభమైన శ్రీవారి బ్రహ్మోత్సవాలు
- టీటీడీ ఛైర్మన్, ఈఓ ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా పూజలు
- సకల దేవతలకు ఆహ్వానంగా గరుడ పతాకాన్ని ఎగురవేసిన అర్చకులు
- తొలిరోజు పెద్దశేష వాహనంపై విహరించిన మలయప్ప స్వామి
- భక్తులు ఎంతగానో ఎదురుచూసే గరుడ సేవ ఈనెల 28న
- అక్టోబర్ 2న చక్రస్నానంతో ముగియనున్న ఉత్సవాలు
ధ్వజస్తంభంపై ఎగిరే ఈ గరుడ పతాకమే బ్రహ్మోత్సవాలకు హాజరుకావాల్సిందిగా సకల దేవతలను, అష్టదిక్పాలకులను, ఇతర గణాలను ఆహ్వానించే శుభ సూచికమని అర్చకులు వివరించారు. ధ్వజారోహణం అనంతరం శ్రీ మలయప్ప స్వామి వారు ఏడు తలల పెద్దశేష వాహనంపై తిరుమాడ వీధులలో విహరిస్తూ భక్తులకు కనువిందు చేశారు.
బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారు ప్రతిరోజూ ఉదయం, రాత్రి వేళల్లో వివిధ వాహనాలపై దర్శనమివ్వనున్నారు. గురువారం ఉదయం చిన్నశేష వాహనం, రాత్రి హంస వాహనంపై ఊరేగుతారు. ఈనెల 26న సింహ, ముత్యపు పందిరి వాహనాలపై, 27న కల్పవృక్ష, సర్వభూపాల వాహనాలపై స్వామివారు భక్తులను కటాక్షిస్తారు.
భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో ఎదురుచూసే ప్రధాన ఘట్టమైన గరుడ వాహన సేవ ఈనెల 28వ తేదీ సాయంత్రం జరగనుంది. అదే రోజు ఉదయం స్వామివారు మోహినీ అవతారంలో అభయమిస్తారు. 29న హనుమంత వాహనం, స్వర్ణరథం, గజ వాహనంపైనా, 30న సూర్యప్రభ, చంద్రప్రభ వాహనాలపైనా విహరిస్తారు. అక్టోబర్ 1న రథోత్సవం (పెద్దతేరు), అక్టోబర్ 2న ఉదయం చక్రస్నానం, రాత్రి ధ్వజావరోహణంతో ఈ ఉత్సవాలు పరిసమాప్తం అవుతాయని అధికారులు తెలిపారు.