'ఓజీ' టికెట్ ధరల పెంపునకు బ్రేక్.. ప్రభుత్వ ఉత్తర్వులను సస్పెండ్ చేసిన హైకోర్టు
- పవన్ కల్యాణ్ ‘ఓజీ’ సినిమాకు హైకోర్టులో ఎదురుదెబ్బ
- టికెట్ ధరల పెంపు, బెనిఫిట్ షోలకు ప్రభుత్వ అనుమతి రద్దు
- తెలంగాణ సర్కార్ జీవోను సస్పెండ్ చేసిన న్యాయస్థానం
- వారం పాటు రేట్లు పెంచుకునేందుకు గతంలో గ్రీన్ సిగ్నల్
- రేపే సినిమా విడుదల కానుండగా కీలక పరిణామం
‘ఓజీ’ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం అభ్యర్థన మేరకు ప్రత్యేక షోలతో పాటు వారం రోజుల పాటు టికెట్ ధరలను పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీని ప్రకారం, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్పై రూ. 100, మల్టీప్లెక్స్లలో రూ. 150 అదనంగా వసూలు చేసుకునేందుకు వెసులుబాటు కల్పించింది. అలాగే ప్రత్యేక బెనిఫిట్ షోల టికెట్ ధరను రూ. 800 వరకు అమ్ముకోవచ్చని ఆ ఉత్తర్వులలో పేర్కొంది.
అయితే, ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు, ప్రభుత్వ ఉత్తర్వుల అమలును నిలిపివేసింది. తాజా ఆదేశాలతో ‘ఓజీ’ సినిమాను తెలంగాణ వ్యాప్తంగా సాధారణ టికెట్ ధరలతోనే ప్రదర్శించాల్సి ఉంటుంది. భారీ అంచనాల మధ్య విడుదలవుతున్న ఈ సినిమాకు కోర్టు తీర్పు కొంత నిరాశ కలిగించే అంశంగా మారింది.