రెండో రోజు ముగిసిన మిథున్ రెడ్డి సిట్ విచారణ
- ఏపీ లిక్కర్ స్కామ్లో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి విచారణ
- రెండో రోజు కూడా కొనసాగిన సిట్ కస్టడీ
- సుమారు 4 గంటల పాటు ప్రశ్నించిన అధికారులు
- ముగిసిన రెండు రోజుల సిట్ కస్టడీ గడువు
- విచారణ అనంతరం ఏసీబీ కోర్టులో హాజరు
- తిరిగి రాజమహేంద్రవరం జైలుకు తరలింపు
ఈ కేసులో నాలుగో నిందితుడిగా (ఏ-4) ఉన్న మిథున్ రెడ్డిని.. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి అధికారులు విజయవాడకు తరలించి ప్రశ్నించారు. శనివారం దాదాపు నాలుగు గంటల పాటు ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది. స్కామ్కు సంబంధించిన కీలక అంశాలపై అధికారులు ఆరా తీసినట్లు సమాచారం.
రెండు రోజుల కస్టడీలో భాగంగా తొలిరోజైన శుక్రవారం కూడా సిట్ అధికారులు మిథున్ రెడ్డిని నాలుగు గంటలకు పైగా విచారించారు. ఆ సమయంలో ఆయనకు 50కి పైగా ప్రశ్నలు సంధించినట్లు వార్తలు వచ్చాయి. రెండు రోజుల పాటు సాగిన ఈ విచారణలో అధికారులు పలు కీలక వివరాలు రాబట్టినట్లు భావిస్తున్నారు. విచారణ ముగిసిన నేపథ్యంలో, ఆయన్ను విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచి, అనంతరం తిరిగి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించనున్నారు.