చంద్రబాబును కలవడంలో ఎలాంటి దాపరికాలు లేవు: కేటీఆర్ వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి స్పందన
- కేటీఆర్ లోకేశ్ను ఎందుకు కలిశారో చెప్పాలని నిలదీత
- చంద్రబాబును అరెస్టు చేసినప్పుడు కేటీఆర్ ఎందుకు స్పందించలేదని ప్రశ్న
- హైదరాబాద్లో ప్రజలు రోడ్ల పైకి వస్తే అణిచివేశారన్న ముఖ్యమంత్రి
ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ, గతంలో చంద్రబాబును అరెస్టు చేసినప్పుడు హైదరాబాద్లో ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారని, ఆ సమయంలో కేటీఆర్ వారిని అణచివేశారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. "లోకేశ్ తమ సోదరుడి వంటి వారని చెప్పే కేటీఆర్, చంద్రబాబు కష్టాల్లో ఉన్నప్పుడు కనీసం స్పందించలేదు. పైగా నిరసన తెలిపిన వారిపై చర్యలు తీసుకున్నారు" అని ఆయన విమర్శించారు.
తనపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలకు సమాధానంగానే తాను కేటీఆర్, లోకేశ్ భేటీ విషయాన్ని ప్రస్తావించాల్సి వచ్చిందని రేవంత్ రెడ్డి తెలిపారు. "నన్ను, చంద్రబాబును ఒకటేనని ప్రచారం చేస్తున్నారు. అందుకే కేటీఆర్, లోకేశ్ ఎందుకు కలిశారో చెప్పాలని అడిగాను" అని ఆయన వివరించారు. తన వ్యాఖ్యలకు నారా లోకేశ్తో ఎలాంటి సంబంధం లేదని, లోకేశ్ను చీకట్లో ఎందుకు కలిశారో కేటీఆరే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.