త్వరలో బీసీ రక్షణ చట్టానికి తుది రూపం: ఏపీ మంత్రి సవిత
- సచివాలయంలో మంత్రి సవిత అధ్యక్షతన బీసీ మంత్రుల భేటీ
- బడ్జెట్లో రూ.47 వేల కోట్లకుపైగా కేటాయించడం ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమన్న మంత్రి సవిత
- బీసీలు ఆత్మగౌరవంతో జీవించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడతామని వెల్లడి
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి బీసీల అభ్యున్నతికి నిరంతరం కృషి జరుగుతోందని, ఈ పరంపరను కొనసాగిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్న ఎన్టీఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్నారని తెలిపారు. 2025-26 బడ్జెట్లో చరిత్రలో ఎన్నడూ లేనంతగా రూ.47 వేల కోట్లకు పైగా బీసీ సంక్షేమానికి కేటాయించడం ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని అన్నారు. గత ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీల్లో భాగంగా బీసీ రక్షణ చట్టాన్ని రూపొందించేందుకు ప్రభుత్వం నడుం బిగించిందని తెలిపారు. బీసీలు ఆత్మగౌరవంతో జీవించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడతామని ఆమె పేర్కొన్నారు.
ఈ సమావేశంలో బీసీ రిజర్వేషన్ల అంశంపై కూడా చర్చ జరిగిందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. చట్టపరంగా, న్యాయపరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా బీసీ రక్షణ చట్టాన్ని రూపొందించాలనే విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువచ్చామని ఆమె తెలిపారు.