నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
- 20 అంశాలపై చర్చకు టీడీపీ ప్రతిపాదన!
- ఆరు అర్డినెన్స్ స్థానంలో బిల్లులు
- నేడు మంత్రిమండలి సమావేశం
ఈ సమావేశాల్లో ప్రభుత్వం మొత్తం ఆరు ఆర్డినెన్సుల స్థానంలో బిల్లులను ప్రవేశపెట్టనుంది. వాటిలో పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టాల సవరణలు, ఏపీ మోటారు వాహనాల పన్నుల బిల్లు, ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన బిల్లు, అలాగే ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ బిల్లు వంటి కీలక అంశాలు ఉండనున్నాయి. ప్రభుత్వ విధానాల అమలు, కొత్త పెట్టుబడుల ప్రోత్సాహం, డీఎస్సీ ద్వారా 16వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీ, సూపర్ - 6, పి - 4, సాగునీటి ప్రాజెక్టుల పురోగతి వంటి 20 అంశాలపై ఈ సమావేశాల్లో చర్చ జరగనుంది.
ఈ రోజు ఉదయం 9 గంటలకు శాసనసభ, 10 గంటలకు శాసనమండలి ప్రారంభం కానున్నాయి. ప్రశ్నోత్తరాల అనంతరం ప్రభుత్వం పలు పత్రాలను సభలో ప్రవేశపెట్టనుంది. అనంతరం బీఏసీ సమావేశంలో సభలను ఎన్ని రోజులు నిర్వహించాలి, ఎజెండాలో ఏ అంశాలు ఉండాలి అనే దానిపై చర్చించి నిర్ణయం తీసుకుంటారు. శాసనమండలి బీఏసీ సమావేశం రేపు జరగనుంది.
కాగా, ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బిల్లులపై చర్చించి, మంత్రిమండలి ఆమోదం తెలపడానికి ఈరోజు మధ్యాహ్నం మంత్రి మండలి సమావేశం జరగనుంది. మంత్రులు సభలో ఎలా స్పందించాలన్న దానిపై ముఖ్యమంత్రి చంద్రబాబు పలు సూచనలు చేయనున్నారు.