జూబ్లీహిల్స్ ఉపఎన్నిక: కవిత కొత్త వ్యూహం.. బరిలో మాజీ ఎమ్మెల్యే?
- మాగంటి గోపీనాథ్ మృతితో జూబ్లీహిల్స్కు ఉపఎన్నిక
- రేసులోకి కవిత.. సొంత అభ్యర్థిని నిలబెట్టే యోచన
- జాగృతి తరఫున విష్ణువర్థన్ రెడ్డి పోటీ చేసే అవకాశం
- విష్ణుతో కవిత భేటీ.. అరగంటకు పైగా మంతనాలు
- దసరా వేడుకలకే ఆహ్వానించానన్న విష్ణు.. రాజకీయ భేటీ కాదని వెల్లడి
- బతుకమ్మ పండుగనాడు కొత్త పార్టీ ప్రకటనపై ఊహాగానాలు
దాదాపు అరగంటకు పైగా సాగిన ఈ సమావేశంలో జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో పోటీ సహా పలు కీలక రాజకీయ అంశాలపై వీరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. జాగృతి నుంచి విష్ణువర్థన్ రెడ్డిని బరిలోకి దించే విషయం దాదాపు ఖరారైందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే, ఈ భేటీ అనంతరం విష్ణువర్థన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ఇది కేవలం మర్యాదపూర్వక భేటీ మాత్రమేనని స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయంలో జరిగే దసరా వేడుకలకు కవితను ఆహ్వానించడానికే తాను కలిశానని, దీనికి రాజకీయాలు ఆపాదించవద్దని ఆయన కోరారు.
మరోవైపు, బీఆర్ఎస్ నుంచి బహిష్కరణకు గురైన తర్వాత తనకంటూ ప్రత్యేక రాజకీయ వేదికను ఏర్పాటు చేసుకునే పనిలో కవిత నిమగ్నమైనట్లు తెలుస్తోంది. ఈ ఏడాది బతుకమ్మ పండుగ సందర్భంగా ఆమె తన కొత్త పార్టీ పేరును ప్రకటించే అవకాశాలు ఉన్నాయని కూడా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే తన రాజకీయ భవిష్యత్తుకు తొలి అడుగుగా జూబ్లీహిల్స్ ఉపఎన్నికను ఆమె ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో జూబ్లీహిల్స్కు ఉపఎన్నిక అనివార్యమైంది. త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుండటంతో ప్రధాన పార్టీలు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నాయి. అధికార కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, అంజన్ కుమార్ యాదవ్ టికెట్ ఆశిస్తుండగా, బీఆర్ఎస్ నుంచి దివంగత మాగంటి గోపీనాథ్ అర్ధాంగి సునీత పోటీ చేయడం దాదాపు ఖాయమైంది. జీహెచ్ఎంసీ ఎన్నికల ముందు సత్తా చాటాలని బీజేపీ సైతం బలమైన అభ్యర్థి కోసం వెతుకుతోంది. ఇప్పుడు కవిత కూడా తన అభ్యర్థిని నిలబెడితే జూబ్లీహిల్స్ పోరు మరింత రసవత్తరంగా మారనుంది.