మూడు రోజుల ముందే రుతుపవనాల నిష్క్రమణ.. బంగాళాఖాతంలో మరో ఆవర్తనం!
- పశ్చిమ రాజస్థాన్ నుంచి నైరుతి రుతుపవనాల నిష్క్రమణ
- సాధారణ తేదీ కంటే మూడు రోజుల ముందే ఉపసంహరణ
- ఈ ఏడాది దేశవ్యాప్తంగా 7 శాతం అధిక వర్షపాతం
- ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం
- 20వ తేదీ నాటికి అల్పపీడనంగా మారే అవకాశం
ఈ రుతుపవనాల సీజన్లో దేశవ్యాప్తంగా అంచనాలకు మించి వర్షపాతం నమోదైంది. జూన్ 1 నుంచి సెప్టెంబరు 14 మధ్య కాలంలో సాధారణంగా 790.1 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా, ఈసారి 846.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు అధికారులు తెలిపారు. ఇది సాధారణం కంటే 7 శాతం అధికం.
ఒకవైపు రుతుపవనాలు వెనుదిరుగుతుండగా, మరోవైపు బంగాళాఖాతంలో వాతావరణ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఆదివారం ఆగ్నేయ బంగాళాఖాతంలో కొత్త ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. వాతావరణ నమూనాల అంచనాల ప్రకారం ఈ ఆవర్తనం ఈ నెల 20వ తేదీ నాటికి వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. అయితే, అది ఆ తర్వాత మరింత బలపడుతుందా? లేదా? అనే విషయంపై ఇప్పుడే స్పష్టత ఇవ్వలేమని వాతావరణ నిపుణులు విశ్లేషిస్తున్నారు.