Vijay: నా యాత్రలకు వస్తున్న ప్రజాస్పందన చూసి ఓర్వలేకపోతున్నారు: విమర్శలను తిప్పికొట్టిన టీవీకే అధినేత విజయ్

Vijay Slams Critics Over Public Support for His Tours
షార్ట్స్‌లో చూడండి
తమిళనాడు రాజకీయాల్లో తనదైన ముద్ర వేయాలని భావిస్తున్న నటుడు, తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్, అధికార డీఎంకే ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్టీ చారిత్రక విజయం సాధించడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సిద్ధాంత బలం లేని పార్టీ అంటూ కొందరు చేస్తున్న విమర్శలను ఆయన కొట్టిపారేశారు.

ఈ మేరకు ఆయన విడుదల చేసిన ఒక ప్రకటనలో, డీఎంకే ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని ఆరోపించారు. "ప్రజలు ఎంతో నమ్మకంతో అధికారం అప్పగిస్తే, డీఎంకే వారిని మోసం చేసింది. పారిశుద్ధ్య కార్మికులు, అంగన్వాడీ సిబ్బంది, రైతులు, మత్స్యకారులు ఇలా అన్ని వర్గాల వారు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. వారి సమస్యలను పరిష్కరించాల్సింది పోయి, అరెస్టులు చేయడం, కేసులు పెట్టడం దారుణం. రైతులపై గూండా చట్టం ప్రయోగించడం సామాజిక న్యాయం ఎలా అవుతుంది?" అని ఆయన ప్రశ్నించారు.

తనపై వస్తున్న వ్యక్తిగత విమర్శలపైనా విజయ్ స్పందించారు. "గతంలో 'విజయ్ బయటకు రారు, ప్రజలను కలవరు' అని అన్నవారే, ఇప్పుడు నా యాత్రలకు వస్తున్న ప్రజా స్పందన చూసి ఓర్వలేక రకరకాలుగా విమర్శిస్తున్నారు" అని అన్నారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్‌ (ఎంజీఆర్)ను కూడా ఒకప్పుడు 'రాజకీయ పరిజ్ఞానం లేని వ్యక్తి' అంటూ ఎగతాళి చేశారని, కానీ ఆయనే ప్రజల గుండెల్లో నిలిచిన విప్లవ నాయకుడిగా ఎదిగారని గుర్తుచేశారు. ఆనాటికీ, ఈనాటికీ ప్రత్యర్థుల తీరులో మార్పు లేదని వ్యాఖ్యానించారు.

తమ పార్టీ సామాజిక న్యాయం, లౌకికవాదం, సర్వమానవ సమానత్వం వంటి సూత్రాలకు కట్టుబడి ఉంటుందని విజయ్ స్పష్టం చేశారు. పెరియార్, కామరాజ్, అంబేడ్కర్, వేలునాచియార్ వంటి మహనీయుల ఆశయాల స్ఫూర్తితో ముందుకు సాగుతామని తెలిపారు. 1967, 1977లో తమిళ ప్రజలు చారిత్రక తీర్పు ఇచ్చినట్టే, 2026లో కూడా తమ పార్టీకి ఘన విజయాన్ని అందిస్తారని ఆయన పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు.
Go Back to Shorts
Vijay
Tamilaga Vetri Kazhagam
TVK
Tamil Nadu politics
DMK government
2026 elections
MGR
social justice
Periyar
Kamraj

More Telugu News