Anugrah Narayan Road Ghat station: ఏడాదిలో 15 రోజులు మాత్రమే తెరుచుకునే రైల్వే స్టేషన్... పితృదేవతల కోసం ప్రత్యేకం!

Anugrah Narayan Road Ghat Station Opens 15 Days a Year for Ancestors
  • పున్‌పున్‌ నదీ తీరంలో పిండ ప్రదానాల కోసం ఈ సౌకర్యం
  • ఈ నెల 21 వరకు 8 జతల రైళ్లు ఈ స్టేషన్‌లో ఆగుతాయి
  • ఇక్కడ టికెట్ కౌంటర్ ఉండదు, గయా టికెట్‌తోనే ప్రయాణం
మన దేశంలో వేల సంఖ్యలో రైల్వే స్టేషన్లు నిత్యం ప్రయాణికులతో రద్దీగా ఉంటాయి. కానీ, బీహార్‌లో ఓ రైల్వే స్టేషన్ మాత్రం ఇందుకు పూర్తి భిన్నం. అది సంవత్సరంలో కేవలం 15 రోజులు మాత్రమే పనిచేస్తుంది. మిగతా రోజులన్నీ మూసి ఉంటుంది. పితృ పక్షం సందర్భంగా పితృదేవతలకు పిండ ప్రదానం చేసే వారి సౌకర్యార్థం భారతీయ రైల్వే ఈ ప్రత్యేక స్టేషన్‌ను తాత్కాలికంగా నిర్వహిస్తోంది.

బీహార్‌లోని ఔరంగాబాద్ జిల్లాలో ఉన్న అనుగ్రహ నారాయణ్ రోడ్ ఘాట్ స్టేషన్ ఇదే. ప్రతి ఏటా పితృ పక్షం రోజుల్లో మాత్రమే ఈ స్టేషన్‌ను తెరుస్తారు. ఈ ఏడాది సెప్టెంబర్ 7న పితృ పక్షం ప్రారంభం కావడంతో ఈ స్టేషన్ కార్యకలాపాలు మొదలయ్యాయి. స్టేషన్ సమీపంలో ప్రవహించే పున్‌పున్‌ నది తీరంలో ప్రజలు తమ పితృదేవతలకు పిండ ప్రదానాలు, తర్పణాలు సమర్పిస్తారు. గంగా నది కంటే పురాతనమైనదిగా భావించే ఈ నదిని ‘ఆదిగంగ పున్‌పున్‌’ అని కూడా పిలుస్తారు.

ఈ 15 రోజుల పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు ఇక్కడికి తరలివస్తారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈస్ట్ సెంట్రల్ రైల్వే ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. సెప్టెంబర్ 21 వరకు దాదాపు 8 జతల ప్యాసింజర్ రైళ్లు ఈ స్టేషన్‌లో ఆగుతాయని అధికారులు తెలిపారు.

ఈ స్టేషన్ మరో ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ టికెట్ కౌంటర్ ఉండదు. పిండ ప్రదానాల కోసం వచ్చేవారు సమీపంలోని గయా స్టేషన్ వరకు టికెట్ కొనుగోలు చేస్తారు. పున్‌పున్‌ నదిలో కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తర్వాత, అదే టికెట్‌పై గయాకు ప్రయాణిస్తారు. కేవలం ఒక ధార్మిక కార్యక్రమం కోసం రైల్వే శాఖ ఒక స్టేషన్ ను ఏర్పాటు చేయడం గమనార్హం.
Anugrah Narayan Road Ghat station
Pitru Paksha
Bihar railway station
Punpun river
पिंड दान
Gaya station
Indian Railways
पितृ पक्ष
Aadi Ganga Punpun
Hindu rituals

More Telugu News