Emmanuel Macron: పారిస్‌లో దారుణం.. మసీదుల బయట మాక్రాన్ పేరుతో పంది తలలు

Macron Name Pig Heads Placed Outside Paris Mosques Spark Outrage
షార్ట్స్‌లో చూడండి
ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో ఈ వారం కొన్ని మసీదుల వెలుపల మాక్రాన్ పేరుతో తొమ్మిది పంది తలలను కనుగొనడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలను ముస్లిం సమాజంపై ద్వేషంతో కూడిన దాడిగా స్థానిక నేతలు తీవ్రంగా ఖండించారు. 2023 అక్టోబర్‌లో గాజా యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఫ్రాన్స్‌లో ముస్లిం వ్యతిరేక దాడులు గణనీయంగా పెరిగాయని ఈ సంఘటనలు మరోసారి స్పష్టం చేస్తున్నాయి.

ఫ్రెంచ్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది జనవరి నుంచి మే మధ్య కాలంలో ముస్లిం వ్యతిరేక ఘటనలు 75 శాతం పెరిగాయి. ముఖ్యంగా వ్యక్తులపై దాడులు మూడు రెట్లు అధికమయ్యాయి. గాజా సంక్షోభం తర్వాత పలు యూరోపియన్ దేశాల్లో ఇస్లామోఫోబియా, యాంటీ-సెమిటిజం (యూదు వ్యతిరేకత) రెండూ పెరిగాయని యూరోపియన్ యూనియన్ ఏజెన్సీ ఫర్ ఫండమెంటల్ రైట్స్ కూడా నివేదించింది.

మసీదులను అపవిత్రం చేసిన ఈ ఘటనలపై రాజకీయ, మత పెద్దల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ వెంటనే ముస్లిం సమాజ ప్రతినిధులతో సమావేశమై తన మద్దతు తెలిపారు. ఈ చర్యలను "జాత్యహంకార చర్యలు"గా అభివర్ణించిన పారిస్ మేయర్ ఎన్నే హిడాల్గో నగరం తరఫున చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు ప్రకటించారు. 

అంతర్గత వ్యవహారాల మంత్రి బ్రూనో రిటైల్లూ ఈ దాడులను "దారుణమైనవి, ఏమాత్రం ఆమోదయోగ్యం కానివి" అని అన్నారు. "మా ముస్లిం దేశస్థులు తమ విశ్వాసాన్ని శాంతియుతంగా ఆచరించుకోవాలి" అని ఆయన భరోసా ఇచ్చారు. యూరోపియన్ యూనియన్‌లో అత్యధిక ముస్లిం జనాభా, అలాగే ఇజ్రాయెల్, అమెరికా తర్వాత అత్యధిక యూదు జనాభా ఫ్రాన్స్‌లోనే ఉంది. ఈ నేపథ్యంలో దేశంలో మతపరమైన ఉద్రిక్తతలు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి.
Go Back to Shorts
Emmanuel Macron
Paris mosques
France anti Muslim attacks
Gaza war
Anne Hidalgo
Bruno Retailleau
Islamophobia Europe
religious tensions France

More Telugu News