UPI: యూపీఐలో ఫోన్‌పే హవా.. గూగుల్ పే, పేటీఎం వెనకంజ.. మార్కెట్లో ఎవరి వాటా ఎంత?

PhonePe Dominates UPI Market Google Pay Paytm Lag Behind
షార్ట్స్‌లో చూడండి
భారత్‌లో డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ అయిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) మరోసారి సంచలనం సృష్టించింది. దేశవ్యాప్తంగా యూపీఐ ద్వారా జరిగే లావాదేవీలు సరికొత్త చరిత్రను లిఖించాయి. గత ఆగస్టు నెలలో తొలిసారిగా 2000 కోట్ల లావాదేవీల మైలురాయిని అధిగమించాయి. ఈ మేరకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) అధికారిక గణాంకాలను విడుదల చేసింది.

వివరాల్లోకి వెళితే.. 2016లో ప్రారంభమైన నాటి నుంచి యూపీఐ వినియోగం గణనీయంగా పెరుగుతూ వస్తోంది. చిన్నచిన్న కొనుగోళ్ల నుంచి పెద్దమొత్తంలో చెల్లింపుల వరకు అన్నీ యూపీఐ ద్వారానే జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే, గత ఆగస్టు నెలలో ఏకంగా 2000 కోట్ల లావాదేవీలు జరిగాయి. ఈ లావాదేవీల మొత్తం విలువ సుమారు రూ. 24.85 లక్షల కోట్లుగా నమోదైంది. ఒకే నెలలో ఇంత భారీ స్థాయిలో లావాదేవీలు జరగడం ఇదే మొదటిసారి.

ఇక, యూపీఐ మార్కెట్లో ప్రధానంగా ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. అయితే, ఎన్‌పీసీఐ విడుదల చేసిన డేటా ప్రకారం, ఈ పోటీలో ఫోన్‌పే స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. మొత్తం యూపీఐ లావాదేవీల్లో ఫోన్‌పే వాటా ఏకంగా 48.64 శాతంగా ఉంది. ఒక్క ఆగస్టు నెలలోనే ఫోన్‌పే ద్వారా 960 కోట్లకు పైగా లావాదేవీలు జరిగాయి. వీటి విలువ సుమారు రూ.12 లక్షల కోట్లకు పైగా ఉందని నివేదిక స్పష్టం చేసింది.

ఫోన్‌పే తర్వాత 35.53 శాతం మార్కెట్ వాటాతో గూగుల్ పే రెండో స్థానంలో నిలిచింది. గూగుల్ పే ప్లాట్‌ఫామ్ ద్వారా ఆగస్టులో 740 కోట్ల లావాదేవీలు జరగ్గా, వాటి విలువ రూ. 8.83 లక్షల కోట్లుగా ఉంది. ఒకప్పుడు మార్కెట్లో గట్టి పోటీ ఇచ్చిన పేటీఎం వాటా ఇప్పుడు 8.5 శాతానికి పరిమితమైంది. మిగిలిన వాటాను క్రెడ్, నవీ వంటి ఇతర యాప్‌లు పంచుకున్నాయి. ఈ గణాంకాలు యూపీఐ మార్కెట్‌లో ఫోన్‌పే తన ఆధిపత్యాన్ని మరింత పటిష్ఠం చేసుకుంటోందని స్పష్టం చేస్తున్నాయి.
Go Back to Shorts
UPI
PhonePe
UPI payments
Google Pay
Paytm
digital payments India
NPCI
unified payment interface
digital transactions
Cred
Navi

More Telugu News