PM Modi: భారత్-అమెరికా వాణిజ్య యుద్ధానికి తెర?.. త్వరలో ట్రంప్‌తో మాట్లాడతానన్న ప్రధాని మోదీ

Also Eager To Unlock Limitless Potential Of India US Ties PM Modi On Trump Post
షార్ట్స్‌లో చూడండి
భారత్, అమెరికా మధ్య కొంతకాలంగా నెలకొన్న వాణిజ్య ఉద్రిక్తతలకు తెరపడే సూచనలు కనిపిస్తున్నాయి. ఇరు దేశాల మధ్య ఆగిపోయిన వాణిజ్య చర్చలు మళ్లీ ప్రారంభమైనట్లు ఇరు దేశాధినేతలు స్పష్టం చేశారు. ఈ చర్చలు వీలైనంత త్వరగా విజయవంతంగా ముగుస్తాయని భారత ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం విశ్వాసం వ్యక్తం చేశారు. త్వరలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో మాట్లాడతానని ఆయన తెలిపారు.

వాణిజ్య చర్చల పునరుద్ధరణపై డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో చేసిన పోస్టుకు ప్రధాని మోదీ బదులిచ్చారు. "భారత్, అమెరికా సన్నిహిత మిత్ర దేశాలు, సహజ భాగస్వాములు. మన వాణిజ్య చర్చలు ఇరు దేశాల మధ్య భాగస్వామ్యంలోని అపరిమితమైన సామర్థ్యాన్ని వెలికితీసేందుకు మార్గం సుగమం చేస్తాయని నేను విశ్వసిస్తున్నాను. మా బృందాలు ఈ చర్చలను త్వరగా ముగించేందుకు కృషి చేస్తున్నాయి. నేను కూడా అధ్యక్షుడు ట్రంప్‌తో మాట్లాడాలని ఎదురుచూస్తున్నాను" అని మోదీ ఎక్స్ (ట్విట్ట‌ర్‌) వేదికగా పేర్కొన్నారు. ఇరు దేశాల ప్రజల ఉజ్వల భవిష్యత్తు కోసం కలిసి పనిచేస్తామని ఆయన స్పష్టం చేశారు.

అంతకుముందు, భారత్‌తో వాణిజ్య చర్చలు తిరిగి ప్రారంభించామని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. "రెండు దేశాల మధ్య వాణిజ్య అవరోధాలను తొలగించేందుకు చర్చలు కొనసాగుతున్నాయని చెప్పడానికి సంతోషిస్తున్నాను" అని ఆయన తన 'ట్రూత్ సోషల్' ఖాతాలో తెలిపారు. మంగళవారం ఆయన ప్రధాని మోదీని "నాకు చాలా మంచి మిత్రుడు" అని అభివర్ణించారు. రాబోయే వారాల్లో ఆయనతో మాట్లాడతానని చెప్పారు. ఇరు దేశాలకు మేలు చేసేలా ఈ చర్చలు విజయవంతంగా ముగుస్తాయన్న నమ్మకం తనకుందని ట్రంప్ పేర్కొన్నారు.

రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తున్న నేపథ్యంలో అమెరికా ప్రతీకార సుంకాలు విధించడం, దీనిపై అసంతృప్తితో ప్రధాని మోదీ ట్రంప్ నుంచి వచ్చిన ఫోన్ కాల్స్‌ను పట్టించుకోలేదని గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఇటీవల కాలంలో అమెరికా వైపు నుంచి స్వరంలో మార్పు కనిపిస్తోంది. గత శుక్రవారం కూడా ట్రంప్, ప్రధాని మోదీని 'గొప్ప ప్రధాని' అని ప్రశంసించారు. ఇరు దేశాల మధ్య ఉన్నది ప్రత్యేక సంబంధమని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. ట్రంప్ సానుకూల వ్యాఖ్యలను తాను కూడా పూర్తిగా స్వాగతిస్తున్నానని శనివారం ప్రధాని మోదీ బదులిచ్చారు. తాజా పరిణామాలతో ఇరు దేశాల మధ్య టారిఫ్‌ల వివాదానికి త్వరలోనే ముగింపు లభించవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
Go Back to Shorts
PM Modi
Donald Trump
India US trade
India America relations
Trade negotiations
India US partnership
G20 Summit
X platform
Indian Prime Minister
US President

More Telugu News