Ganesh Nimajjanam: హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం వేళ విషాదం... ఇద్దరు మహిళల మృతి

Ganesh Nimajjanam Hyderabad Two Women Died in Accidents
షార్ట్స్‌లో చూడండి
నగరంలో గణేశ్ నిమజ్జన వేడుకలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ఆదివారం వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రెండు ఘోర రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మహిళలు మృతి చెందగా, ముగ్గురు పోలీసు కానిస్టేబుళ్లతో సహా ఐదుగురు గాయపడ్డారు.

పోలీసుల కథనం ప్రకారం.. గుల్జార్ హౌస్ ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున 4:20 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. గణేశ్ నిమజ్జన బందోబస్తులో భాగంగా డిటెక్టివ్ ఇన్స్‌పెక్టర్ సత్యనారాయణ బృందం వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా, మద్యం మత్తులో ఉన్న ఓ యువకుడు అతివేగంగా కారు నడుపుతూ పోలీసు జీపును బలంగా ఢీకొట్టాడు. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న కశ్వి (20) అనే యువతి అక్కడికక్కడే మరణించింది. కారులో ఉన్న మరో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడగా, వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ప్రమాదంలో ముగ్గురు పోలీసు కానిస్టేబుళ్లకు కూడా స్వల్ప గాయాలయ్యాయి. కారులో మొత్తం ముగ్గురు యువతులు సహా ఐదుగురు యువకులు ఉన్నారని, వారంతా మద్యం సేవించినట్లు పోలీసులు గుర్తించారు. వాహనం నుంచి మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని, లంగర్ హౌస్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరో ఘటనలో, బషీర్‌బాగ్ ప్రాంతంలో విధి నిర్వహణలో ఉన్న ఓ జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికురాలు మృతి చెందింది. గుడిమల్కాపూర్‌కు చెందిన రేణుక (35) అనే కార్మికురాలు రోడ్డు దాటుతుండగా, నిమజ్జన ఊరేగింపునకు చెందిన ఓ వాహనం ఆమెను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె తలకు తీవ్ర గాయాలు కావడంతో తోటి కార్మికులు సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు వాహనం డ్రైవర్ గజానంద్‌ను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి తరలించారు.
Go Back to Shorts
Ganesh Nimajjanam
Hyderabad
road accident
police investigation
Gulzar House
Basheerbagh
GHMC worker
drunk driving
car accident
fatal accident

More Telugu News