అమెరికా ఒత్తిడిని పట్టించుకోం.. రష్యా నుంచి చమురును కొనుగోలు చేస్తాం: తేల్చి చెప్పిన నిర్మలా సీతారామన్
- రష్యా నుంచి చమురు కొనుగోలు కొనసాగిస్తామని స్పష్టం చేసిన కేంద్రం
- దేశ ప్రయోజనాలకు అనుగుణంగానే తమ నిర్ణయాలు ఉంటాయన్న నిర్మలా సీతారామన్
- ధర, రవాణా సౌకర్యాలే మాకు ముఖ్యమని వెల్లడి
- ఓ ప్రైవేట్ టీవీ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు
- రష్యా నుంచి చమురు కొంటున్నందుకు భారత్పై అమెరికా 50 శాతం సుంకం విధింపు
- ఆగస్టు 27 నుంచే అమల్లోకి వచ్చిన ట్రంప్ ఆంక్షలు
ఒక ప్రైవేట్ టీవీ ఛానల్తో మాట్లాడుతూ, "విషయం రష్యా చమురు అయినా, మరేదైనా సరే మాకు ఏది అనుకూలంగా ఉంటే ఆ నిర్ణయమే తీసుకుంటాం. ముఖ్యంగా ధర, రవాణా వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటాం. విదేశీ మారక ద్రవ్యం భారీగా ముడిపడి ఉన్న చమురును ఎక్కడి నుంచి కొనాలనేది పూర్తిగా మా అవసరాలపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి, మేము నిస్సందేహంగా రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తాం" అని ఆమె వివరించారు. దేశ దిగుమతుల బిల్లులో అత్యధిక వాటా ముడి చమురుదేనని ఆమె మరోసారి గుర్తుచేశారు.
రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం ద్వారా ఉక్రెయిన్ యుద్ధానికి భారత్ పరోక్ష ఆర్థిక సాయం అందిస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆగస్టు 27 నుంచి భారత్పై మొత్తం 50 శాతం దిగుమతి సుంకాన్ని ఆయన విధించారు. ఈ పరిణామాల నేపథ్యంలో నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.