జీఎస్టీ సంస్కరణలు చరిత్రాత్మకం.. కేంద్రానికి సీఎం చంద్రబాబు ప్రశంసలు
- కేంద్రం తెచ్చిన జీఎస్టీ సంస్కరణలను స్వాగతించిన సీఎం చంద్రబాబు
- ఇవి పేదలకు, రైతులకు మేలు చేసే నిర్ణయాలన్న ముఖ్యమంత్రి
- అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి చేకూరుతుందని వెల్లడి
- ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు ప్రత్యేక అభినందనలు
- ప్రజల జీవన ప్రమాణాలను పెంచే సంస్కరణలని ప్రశంస
ఈ సంస్కరణలు పేదలకు మేలు చేసేవిగా, దేశ అభివృద్ధికి దోహదపడేవిగా ఉన్నాయని చంద్రబాబు పేర్కొన్నారు. కేంద్రం తీసుకున్న ఈ సానుకూల నిర్ణయం వల్ల రైతుల నుంచి వ్యాపారుల వరకు సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇది ప్రజలందరి బాగోగులను దృష్టిలో ఉంచుకుని తీసుకున్న నిర్ణయమని కొనియాడారు.
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ప్రకటించిన "నవతరం జీఎస్టీ సంస్కరణల"లో భాగంగా ఈ మార్పులు జరిగాయని చంద్రబాబు గుర్తుచేశారు. పన్నుల విధానంలో ఇది ఒక వ్యూహాత్మకమైన ముందడుగు అని ఆయన ప్రశంసించారు. ఈ సంస్కరణలు ప్రతి భారతీయుడి జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే లక్ష్యంగా ఉన్నాయని ముఖ్యమంత్రి అన్నారు.