భూకంపంతో అతలాకుతలమైన ఆప్ఘనిస్థాన్ కు మోదీ ఆపన్న హస్తం
- అఫ్గానిస్థాన్లో 6.0 తీవ్రతతో భారీ భూకంపం
- 800 మందికి పైగా మృతి, 2500 మందికి గాయాలు
- ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి
- సాయం అందించేందుకు భారత్ సిద్ధమని ప్రకటన
ఆదివారం అర్ధరాత్రి 11:47 గంటల సమయంలో ఆప్ఘనిస్థాన్ను 6.0 తీవ్రతతో భారీ భూకంపం కుదిపేసింది. ఈ ప్రకృతి విలయం కారణంగా ఇప్పటివరకు 800 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, మరో 2500 మంది తీవ్రంగా గాయపడినట్లు ఆ దేశ అధికారిక మీడియా సంస్థ రేడియో టెలివిజన్ ఆప్ఘనిస్థాన్ వెల్లడించింది. భూకంపం ధాటికి అనేక గ్రామాల్లో ఇళ్లు నేలమట్టమయ్యాయని, శిథిలాల కింద ఇంకా చాలా మంది చిక్కుకుని ఉండవచ్చని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇదే సమయంలో, బాధితుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని వార్దక్ ప్రావిన్స్ మాజీ మేయర్ జరీఫా ఘఫ్పారీ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత తాలిబన్ ప్రభుత్వం సహాయక చర్యలను సమర్థవంతంగా నిర్వహించలేకపోతోందని ఆమె ఆరోపించారు. మానవతా సంస్థలు, అంతర్జాతీయ సమాజం వెంటనే స్పందించి బాధితులను ఆదుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.