కాళేశ్వరం నివేదిక.. కేసీఆర్ పేరు 266 సార్లు ప్రస్తావన!
- జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్లో సంచలన విషయాలు
- ఏకంగా 266 సార్లు మాజీ సీఎం కేసీఆర్ పేరు ప్రస్తావన
- మాజీ మంత్రి హరీశ్ రావు పేరు 63 సార్లు పేర్కొన్న కమిషన్
- ప్రజాధనం దుర్వినియోగం, నిబంధనల ఉల్లంఘనపై ఆరోపణలు
- మొత్తం 665 పేజీలతో కమిషన్ నివేదిక రూపకల్పన
నివేదికలోని మొత్తం 19 పేజీలలో కేసీఆర్ పేరును ప్రస్తావించారు. ముఖ్యంగా ప్రాజెక్టు అంచనాలను విపరీతంగా పెంచడం, నిపుణుల కమిటీల సూచనలను ఏకపక్షంగా పక్కన పెట్టడం, నిబంధనలను పాటించకపోవడం, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం వంటి తీవ్రమైన అంశాలతో ఆయన పేరు ముడిపడి ఉన్నట్లు కమిషన్ పేర్కొంది. ఈ ఆరోపణలు ప్రాజెక్టు అమలులో మాజీ ముఖ్యమంత్రి పాత్రపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి.
కేసీఆర్తో పాటు, అప్పటి నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన హరీశ్ రావు పేరును కూడా కమిషన్ తన నివేదికలో 63 సార్లు ప్రస్తావించింది. ఇది ప్రాజెక్టు నిర్ణయాలలో ఆయన పాత్రపై కూడా విచారణ జరిగినట్లు సూచిస్తోంది. ఈ నివేదికను ఇంత లోతుగా విశ్లేషించడానికి సహకరించిన తన కార్యదర్శి ఎన్. మురళీధర్ రావుకు జస్టిస్ పీసీ ఘోష్ తన నివేదిక ముగింపులో ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం గతేడాది మార్చిలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ను నియమించిన విషయం తెలిసిందే. ఈ కమిషన్ సుదీర్ఘ విచారణ అనంతరం జూలై 31న ప్రభుత్వానికి తుది నివేదికను అందజేసింది.