'ఘాటీ' ప్రమోషన్లకు దూరంగా అనుష్క.. ఆమె వ్యక్తిగత నిర్ణయమన్న నిర్మాత
- సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానున్న 'ఘాటీ'
- గంజాయి స్మగ్లర్ పాత్ర పోషించిన అనుష్క
- ప్రమోషన్లకు హాజరుకాలేనని అనుష్క ముందే చెప్పారన్న నిర్మాత
ఓ ఇంటర్వ్యూలో రాజీవ్ రెడ్డి మాట్లాడుతూ... "సినిమా ప్రారంభానికి ముందే ప్రమోషన్లకు హాజరు కాలేనని అనుష్క మాకు చెప్పారు. బహుశా ప్రీ-రిలీజ్ వేడుకకు కూడా ఆమె రాకపోవచ్చు. అయినా మాకు ఎలాంటి ఆందోళన లేదు. ఎందుకంటే 'షీలా' పాత్రలో అనుష్క జీవించారు. ఆ పాత్రలో ఆమెను తప్ప మరొకరిని ఊహించుకోలేం. తన నటనతోనే ప్రేక్షకులను థియేటర్లకు రప్పించగల సత్తా ఆమెకు ఉంది" అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఈ సినిమా షూటింగ్ అనుభవాలను పంచుకుంటూ, ఆంధ్రా-ఒడిశా సరిహద్దులోని ఓ మారుమూల గ్రామంలో చిత్రీకరణ జరిపినట్లు ఆయన చెప్పారు. "తెలుగు రాష్ట్రాల్లో షూటింగ్ చేసి ఉంటే అనుష్కను చూడటానికి వచ్చే జనాలను అదుపు చేయడం చాలా కష్టమయ్యేది. ఒడిశాలోని ఓ చిన్న గ్రామంలో తెల్లవారుజామున షూటింగ్ చేస్తున్నా కూడా, ఆమెను చూసేందుకు దాదాపు వెయ్యి మంది వచ్చారు. ఓ సందర్భంలో లాఠీఛార్జి కూడా చేయాల్సి వచ్చింది" అని ఆయన వివరించారు.
ఆంధ్రా-ఒడిశా సరిహద్దు నేపథ్యంలో సాగే ఈ కథలో, అనుష్క, విక్రమ్ ప్రభు గంజాయి స్మగ్లర్లుగా నటించారు. తాము చేస్తున్నది తప్పని తెలుసుకుని, ఆ నేర సామ్రాజ్యాన్ని నడిపించే వ్యవస్థపై వారు ఎలా తిరగబడ్డారన్నదే ఈ చిత్ర కథాంశం.