ఏసీబీకి అడ్డంగా బుక్కైన వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్!
- భద్రాద్రి జిల్లాలో ఏసీబీ ఆకస్మిక దాడులు
- లంచం తీసుకుంటూ పట్టుబడ్డ వ్యవసాయశాఖ ఏడీ నరసింహారావు
- ఎరువుల దుకాణం అనుమతి కోసం రూ. 25 వేల డిమాండ్
- వ్యాపారి ఫిర్యాదుతో వల పన్ని పట్టుకున్న అధికారులు
- అధికారిపై కేసు నమోదు, ఇల్లు, ఆఫీసులో సోదాలు
వివరాల్లోకి వెళితే, ఓ వ్యక్తి ఎరువుల దుకాణం ఏర్పాటు కోసం అనుమతులు కోరుతూ ఏడీ నరసింహారావును సంప్రదించారు. అయితే, అనుమతులు మంజూరు చేయాలంటే తనకు రూ. 25 వేలు లంచం ఇవ్వాలని అధికారి డిమాండ్ చేశారు. దీంతో విసిగిపోయిన బాధితుడు నేరుగా ఏసీబీ అధికారులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.
వ్యాపారి ఫిర్యాదు మేరకు పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు, నరసింహారావుకు డబ్బులు ఇస్తుండగా మాటు వేసి పట్టుకున్నారు. ఆయన లంచం డబ్బును స్వీకరిస్తున్న సమయంలోనే దాడి చేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని అరెస్టు చేశారు. అనంతరం ఆయనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా నరసింహారావు నివాసం, కార్యాలయంలో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వ ఉద్యోగాన్ని అడ్డం పెట్టుకుని అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని ఏసీబీ అధికారులు ఈ సందర్భంగా హెచ్చరించారు.