Raghu Rama Krishna Raju: రఘురామకృష్ణరాజుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట

Raghu Rama Krishna Raju Gets big Relief in Supreme Court
  • కానిస్టేబుల్ ఫరూక్ బాషా దాడి కేసులో రఘురామకు ఊరట
  • రాఘురామపై నమోదైన ఎఫ్ఐఆర్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు
  • కేసును కొనసాగించలేనని అఫిడవిట్ దాఖలు చేసిన బాషా
ఉండి టీడీపీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ రఘురామకృష్ణరాజుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయనపై నమోదైన కానిస్టేబుల్ పై దాడి కేసుకు సంబంధించి దాఖలైన ఎఫ్ఐఆర్‌ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఈ కేసును ముందుకు తీసుకెళ్లడం తనకు ఇష్టం లేదని స్వయంగా సదరు కానిస్టేబుల్ ఫరూక్ బాషా అఫిడవిట్ దాఖలు చేయడంతో ఈ పరిణామం చోటుచేసుకుంది.

ఈ కేసు విచారణ సందర్భంగా, కానిస్టేబుల్ ఫరూక్ బాషా తరపు న్యాయవాది కీలక వాదనలు వినిపించారు. బాషా పనిచేస్తున్న ప్రాంతానికి, హైదరాబాద్‌కు దాదాపు 400 కిలోమీటర్ల దూరం ఉందని, ఈ కారణంగా కేసును కొనసాగించడం కష్టంగా ఉందని కోర్టుకు తెలిపారు. దీనిపై గత విచారణలో స్పందించిన ధర్మాసనం, ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని బాషాను ఆదేశించింది. ఆ ఆదేశాల మేరకు బాషా అఫిడవిట్ సమర్పించడంతో, దానిని పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు రఘురామపై ఉన్న ఎఫ్ఐఆర్‌ను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

2022లో హైదరాబాద్‌లోని రఘురామకృష్ణంరాజు నివాసం వద్ద ఈ వివాదం మొదలైంది. ఆయన ఇంటి వద్ద ఓ వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో, రఘురామ సిబ్బంది అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. విచారణలో ఆ వ్యక్తి కానిస్టేబుల్ ఫరూక్ బాషా అని తేలింది. అప్పటి వైసీపీ ప్రభుత్వం తనపై నిఘా పెట్టేందుకే ఆయన్ను పంపిందని ఆరోపిస్తూ రఘురామ, ఆయన కుమారుడు భరత్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే, ఆ ఫిర్యాదుపై పోలీసులు చర్యలు తీసుకోలేదు. కానీ, కానిస్టేబుల్ బాషా ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా రఘురామ, ఆయన సిబ్బందిపై కేసు నమోదు చేశారు.

ఈ ఎఫ్ఐఆర్‌ను కొట్టివేయాలని కోరుతూ రఘురామ మొదట హైకోర్టును ఆశ్రయించారు. అయితే అక్కడ ఆయనకు చుక్కెదురు కావడంతో, చివరకు సుప్రీంకోర్టును ఆశ్రయించగా, ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చింది. 
Raghu Rama Krishna Raju
TDP MLA
Supreme Court verdict
Andhra Pradesh politics
Gachibowli police station
criminal case quashed
YSRCP government
police constable

More Telugu News