Russia: యూఎస్ మార్కెట్‌లో కష్టాలా? రండి.. మేం ఉన్నాం: భారత్‌కు రష్యా భరోసా

Russia Offers India Market Access Amid US Sanctions
  • భారత ఉత్పత్తులకు తాము స్వాగతం పలుకుతామని ర‌ష్యా బంపర్ ఆఫర్
  • రష్యా నుంచి చమురు కొనుగోలుపై భారత్‌పై అమెరికా ఒత్తిడి అన్యాయమ‌ని వ్యాఖ్య‌
  • భారత్‌కు రష్యానే అతిపెద్ద ముడి చమురు సరఫరాదారు అన్న రష్యా డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ 
  • భారత్-రష్యా ఇంధన సహకారం కొనసాగుతుందని ధీమా
  • స్నేహితులు అలా ప్రవర్తించరంటూ అమెరికాపై రష్యా విమర్శ
భారత ఎగుమతులపై అమెరికా ఆంక్షల ఒత్తిడి పెంచుతున్న వేళ, రష్యా కీలక ప్రకటన చేసింది. ఒకవేళ అమెరికా మార్కెట్‌లో భారత వస్తువులకు ఇబ్బందులు ఎదురైతే, తమ దేశ మార్కెట్ తలుపులు తెరిచే ఉంటాయని స్పష్టం చేసింది. భారత ఉత్పత్తులకు తాము స్వాగతం పలుకుతామని బంపర్ ఆఫర్ ఇచ్చింది. రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్‌పై అమెరికా అనుసరిస్తున్న వైఖరి ఏకపక్షమని, అన్యాయమని తీవ్రంగా విమర్శించింది.

బుధవారం ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో రష్యా డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ రోమన్ బాబుష్కిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. "భారతీయ వస్తువులు అమెరికా మార్కెట్లోకి ప్రవేశించడానికి ఇబ్బందులు పడుతుంటే, రష్యా మార్కెట్ వాటిని స్వాగతించడానికి సిద్ధంగా ఉంది. ఆంక్షలు విధించే వారికే అవి నష్టం కలిగిస్తాయి. ఇది భారత్‌కు సవాలుతో కూడిన పరిస్థితి అయినప్పటికీ, మా సంబంధాలపై మాకు పూర్తి నమ్మకం ఉంది" అని ఆయన తెలిపారు. బాహ్య ఒత్తిళ్లు ఉన్నప్పటికీ భారత్-రష్యా ఇంధన సహకారం కొనసాగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యాపై ఒత్తిడి పెంచేందుకు, ఆ దేశం నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్‌పై ఆగస్టు 27 నుంచి 25 శాతం అదనపు సుంకాలు విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవలే ప్రకటించారు. ఈ నేపథ్యంలో రష్యా అధికారి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. భారత్‌కు రష్యానే అతిపెద్ద ముడి చమురు సరఫరాదారు అని, భారత్ ఇంధన అవసరాలు ఏటా పెరుగుతున్నాయని బాబుష్కిన్ గుర్తుచేశారు.

ఈ క్లిష్ట పరిస్థితుల్లోనూ భారత్, రష్యా బంధం వ్యూహాత్మకంగా కొనసాగుతోందని ఆయన అన్నారు. "పశ్చిమ దేశాలు మిమ్మల్ని విమర్శిస్తున్నాయంటే, మీరు సరైన మార్గంలోనే వెళుతున్నారని అర్థం. వారు తమ సొంత ప్రయోజనాల కోసమే చూసుకునే నయా వలసవాద శక్తుల్లా ప్రవర్తిస్తారు. స్నేహితులు ఇలా ప్రవర్తించరు" అంటూ అమెరికా తీరుపై ఆయన పరోక్షంగా చురకలు అంటించారు. 

ఇటీవలే రష్యా అధ్యక్షుడు పుతిన్, ప్రధాని మోదీకి ఫోన్ చేసి ఉక్రెయిన్ పరిణామాలను వివరించారని, దీన్ని బట్టే రష్యాకు భారత్ ఎంత ముఖ్యమో అర్థమవుతుందని చెప్పారు. విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ప్రస్తుతం రష్యా పర్యటనలో ఉన్న సమయంలో ఈ పరిణామాలు చోటుచేసుకోవడం గమనార్హం.
Russia
India Russia trade
US sanctions
Indian exports
Russian oil
Ukraine war
Narendra Modi
Vladimir Putin
S Jaishankar
Indo Russia relations

More Telugu News