పులివెందుల విజయంపై టీడీపీ నేతలంతా మాట్లాడాలి.. రాష్ట్ర ప్రజలందరికీ తెలియాలి: చంద్రబాబు
- పులివెందులలో పరిస్థితులను ప్రజలు గమనించారన్న చంద్రబాబు
- 30 ఏళ్ల తర్వాత చరిత్రను తిరగరాశామని వ్యాఖ్య
- జగన్ అరాచకాల నుంచి ప్రజలు బయటపడుతున్నారన్న చంద్రబాబు
ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగాయి కాబట్టే పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో ఏకంగా 11 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారని చంద్రబాబు అన్నారు. 30 ఏళ్ల తర్వాత ఓటు వేశామంటూ బ్యాలెట్ బాక్సుల్లో ఓటర్లు స్లిప్పులు పెట్టారని... పులివెందులలో పరిస్థితులు ఎలా ఉన్నాయనేది ప్రజలు గమనించారని చెప్పారు. ఈ విజయంపై టీడీపీ నేతలంతా మాట్లాడాలని సూచించారు. ప్రజలను చైతన్యం చేసే విధంగా నేతలు స్పందించాలని చెప్పారు. 30 ఏళ్ల తర్వాత చరిత్రను తిరగరాశామని అన్నారు.
జగన్ అరాచకాల నుంచి ప్రజలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారని చంద్రబాబు చెప్పారు. 30 ఏళ్ల తర్వాత పులివెందుల ప్రజలు ధైర్యంగా ఓటు వేశారనే విషయాన్ని రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేయాలని మంత్రులకు సూచించారు.