Shehbaz Sharif: నిన్న అసీం మునీర్.. నేడు పాక్ ప్రధాని.. భారత్‌కు తీవ్ర హెచ్చరిక

Pakistan PM Shehbaz Sharif issues warning to India
షార్ట్స్‌లో చూడండి
సింధు నదీ జలాల విషయంలో భారత్, పాకిస్థాన్ మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. తమ దేశానికి చెందిన ఒక్క నీటి చుక్కను కూడా శత్రువులు లాక్కోలేరని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తాజాగా భారత్‌ను ఉద్దేశించి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇస్లామాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, "మా నీటిని అడ్డుకుంటామని బెదిరిస్తే, ఒక్క చుక్కను కూడా మీరు తీసుకోలేరని గుర్తుంచుకోండి. అలాంటి ప్రయత్నం చేస్తే గట్టి గుణపాఠం చెబుతాం" అని వ్యాఖ్యానించారు.

పహల్గామ్‌లో 26 మంది పౌరుల మృతికి కారణమైన ఉగ్రదాడి జరిగిన మరుసటి రోజైన ఏప్రిల్ 23న, 1960 నాటి సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. నీటి ప్రవాహాన్ని అడ్డుకునే ఏ ప్రయత్నాన్నైనా యుద్ధ చర్యగా పరిగణిస్తామని పాకిస్థాన్ పలుమార్లు స్పష్టం చేసింది.

కేవలం ప్రధాని మాత్రమే కాకుండా, పాక్ సైన్యాధిపతి జనరల్ అసిమ్ మునీర్ కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అమెరికాలోని ఫ్లోరిడాలో ప్రవాస పాకిస్థానీయులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ "భారత్ డ్యామ్ కట్టే వరకు వేచి చూస్తాం, కట్టిన తర్వాత దాన్ని నాశనం చేస్తాం. సింధు నది భారతీయుల కుటుంబ ఆస్తి కాదు" అని హెచ్చరించారు.

పాక్ సైన్యాధిపతి వ్యాఖ్యలపై భారత విదేశాంగ శాఖ సోమవారం తీవ్రంగా స్పందించింది. పాకిస్థాన్ పదేపదే అణు బెదిరింపులకు పాల్పడటం వారి నైజమని, ఉగ్రవాద గ్రూపులతో అక్కడి సైన్యం కుమ్మక్కైందనడానికి ఇదే నిదర్శనమని పేర్కొంది. ఇటువంటి బెదిరింపులకు భారత్ తలొగ్గదని, దేశ భద్రత కోసం అన్ని చర్యలూ తీసుకుంటుందని స్పష్టం చేసింది.

 స్నేహపూర్వక దేశమైన అమెరికా గడ్డపై నుంచి ఇలాంటి వ్యాఖ్యలు రావడం విచారకరమని కూడా తెలిపింది. ఇదే అంశంపై పాక్ మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో చేసిన వ్యాఖ్యలకు బీజేపీ నేత, నటుడు మిథున్ చక్రవర్తి ఘాటుగా బదులిచ్చారు. శాంతిని ప్రేమించే పాక్ ప్రజలతో తమకు ఎలాంటి విరోధం లేదని, కానీ అక్కడి ప్రభుత్వ పెద్దలకే తమ హెచ్చరిక అని ఆయన స్పష్టం చేశారు.
Go Back to Shorts
Shehbaz Sharif
Pakistan
India
Indus Water Treaty
Asim Munir
Water dispute
India Pakistan relations
bilawal bhutto
mithun chakraborty
pakistan army

More Telugu News