రాహుల్‌గాంధీ విందులో చివరి వరుసలో ఉద్ధవ్.. బీజేపీ, శివసేన మధ్య మాటల మంటలు!

BJP Criticizes Uddhav Thackeray After Rahul Gandhi Dinner
  • విందులో చివరి వరుసలో ఉద్ధవ్ కూర్చున్న ఫొటోను షేర్ చేసిన మహారాష్ట్ర బీజేపీ
  • ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారంటూ ఫడ్నవీస్, ఏక్‌నాథ్ షిండే విమర్శలు
  • ఎన్డీఏలో ఉన్నప్పుడు ఉద్ధవ్‌కు ముందు వరుసలో గౌరవం దక్కేదని ఫడ్నవీస్ వ్యాఖ్య
  • స్క్రీన్ సరిగా కనిపించకే వెనక్కి వెళ్లామన్న శివసేన (యూబీటీ) 
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇటీవల ఏర్పాటు చేసిన విందు సమావేశంలో శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ థాకరే చివరి వరుసలో కూర్చోవడం మహారాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం రేపింది. ఈ ఫొటోను ఆధారంగా చేసుకుని బీజేపీ, ఏక్‌నాథ్ షిండే వర్గాలు ఉద్ధవ్‌పై తీవ్ర విమర్శలకు దిగగా, శివసేన (యూబీటీ) అంతే దీటుగా బదులిచ్చింది. దీంతో ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది.

ఇటీవల జరిగిన ‘ఇండియా’ కూటమి సమావేశంలో భాగంగా రాహుల్ గాంధీ ఇచ్చిన విందులో ఉద్ధవ్ థాకరే, ఆయన కుమారుడు ఆదిత్య థాకరే, ఎంపీ సంజయ్ రౌత్ చివరి వరుసలో కూర్చున్నారు. ఎన్నికల కమిషన్ పక్షపాతంగా వ్యవహరిస్తోందని ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ ఫొటోను మహారాష్ట్ర బీజేపీ తమ సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసి "ఈ చిత్రంలో ఆత్మగౌరవాన్ని వెతకండి!" అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించింది.

ఈ విషయంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఘాటుగా స్పందించారు. "శివసేన ఎన్డీఏలో ఉన్నప్పుడు ఉద్ధవ్ థాకరేకు ఎప్పుడూ ముందు వరుసలోనే గౌరవం దక్కేది. ఢిల్లీకి తలవంచేది లేదని చెప్పిన ఆయన పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో చూడండి. ఇది మాకు బాధ కలిగిస్తోంది" అని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే కూడా స్పందిస్తూ "బాలాసాహెబ్ థాకరే ఆశయాలను, ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన వారికి ఇలాంటివి ఏమీ అనిపించవు. కాంగ్రెస్ వారికి వారి స్థానం ఏమిటో చూపించింది అని ఎద్దేవా చేశారు.

బీజేపీ, షిండే వర్గాల విమర్శలపై శివసేన (యూబీటీ) నేతలు తీవ్రంగా స్పందించారు. ఎంపీ సంజయ్ రౌత్ మాట్లాడుతూ "నిజానికి మాకు ముందు వరుసలోనే సీట్లు ఇచ్చారు. కానీ ప్రజెంటేషన్ ఇస్తున్న టీవీ స్క్రీన్ సరిగా కనిపించకపోవడంతో మేమే వెనక్కి వెళ్లి కూర్చున్నాం. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ మాకు ఎంతో గౌరవం ఇచ్చారు. బీజేపీ అనవసరంగా ఎవరు ఎక్కడ కూర్చున్నారనే దానిపై రాద్ధాంతం చేస్తోంది" అని ఆగ్రహం వ్యక్తంచేశారు.

ఆదిత్య థాకరే స్పందిస్తూ "కొంతమంది ముందు వరుసలో సీటు కోసం పాకులాడుతారు. కానీ అది మాకు అవసరం లేదు. అక్కడ స్నేహపూర్వక వాతావరణం ఉంది. ఎన్నికల కమిషన్ బీజేపీ కార్యాలయం నుంచి నడుస్తోందన్న నిజం రాహుల్ గాంధీ ప్రజెంటేషన్‌లో బయటపడటమే వారి ఆగ్రహానికి కారణం" అని విమర్శించారు.
Go Back to Shorts
Uddhav Thackeray
Rahul Gandhi
Shiv Sena UBT
Maharashtra Politics
BJP criticism
INDIA alliance meeting
Sanjay Raut
Aditya Thackeray
Eknath Shinde
Devendra Fadnavis

More Telugu News