Nadendla Manohar: హోటళ్లకు మంత్రి నాదెండ్ల హెచ్చరిక.. నాణ్యత లోపిస్తే కఠిన చర్యలే!

Nadendla Manohar Warns Hotels Strict Actions for Poor Quality
షార్ట్స్‌లో చూడండి
రాష్ట్రంలోని హోటళ్లు, రెస్టారెంట్లు, ఫుడ్ కోర్టులలో ఆహార నాణ్యతా ప్రమాణాలను గాలికొదిలితే కఠిన చర్యలు తప్పవని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తీవ్రంగా హెచ్చరించారు. ప్రజల ఆరోగ్య భద్రతే ప్రభుత్వానికి అత్యంత ముఖ్యమని, ఈ విషయంలో ఏమాత్రం ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు.

ఇటీవల విశాఖపట్నంలో నిర్వహించిన తనిఖీలలో వెలుగు చూసిన వాస్తవాలు ఆందోళన కలిగిస్తున్నాయని మంత్రి తెలిపారు. అక్కడ తనిఖీ చేసిన 51 రెస్టారెంట్లలో ఏకంగా 44 చోట్ల ఆహార నాణ్యతా నిబంధనలను పూర్తిగా ఉల్లంఘిస్తున్నట్లు అధికారులు గుర్తించారని ఆయన వివరించారు. పాడైపోయిన ఆహారాన్ని వడ్డించడం, పరిశుభ్రత పాటించకపోవడం, హానికర రంగులు వాడటం వంటి అనేక లోపాలను గుర్తించి, వాటిపై చర్యలకు అవసరమైన ఆధారాలు సేకరించినట్లు పేర్కొన్నారు.

"కొన్ని హోటళ్ల నిర్వాహకులు నాసిరకం, హానికరమైన పదార్థాలను వంటకాలలో కలుపుతూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. దీనివల్ల ప్రజలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు" అని నాదెండ్ల మనోహర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘం కూడా చర్చించిందని, నిబంధనలు పాటించని సంస్థలపై కఠినంగా వ్యవహరించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని ఆయన తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలను ముమ్మరం చేస్తామని, నిబంధనలు మీరినట్లు తేలితే ఎంతటి పెద్ద సంస్థలపై అయినా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. ప్రజలు కూడా బయట ఆహారం తీసుకునేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని, నాణ్యతపై ఏమాత్రం అనుమానం వచ్చినా అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.

Go Back to Shorts
Nadendla Manohar
AP Minister
Food Safety
Restaurant Inspections
Food Quality
Andhra Pradesh
Visakhapatnam Restaurants
Food Adulteration
Health Concerns

More Telugu News