Uttam Kumar Reddy: బనకచర్లను అడ్డుకునేందుకు ఎంతవరకైనా వెళతాం: ఉత్తమ్ కుమార్ రెడ్డి

Uttam Kumar Reddy vows to stop Banakacherla project
షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం కఠిన వైఖరి అవలంబిస్తోంది. ఈ ప్రాజెక్టును చట్టపరంగా అడ్డుకుని తీరుతామని, తెలంగాణ నీటి హక్కులను కాపాడేందుకు ఎంతవరకైనా వెళతామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ విభజన చట్టానికి పూర్తిగా విరుద్ధమని ఆయన పేర్కొన్నారు.

రామగుండం నియోజకవర్గంలో రామగుండం ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిన సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడారు. గోదావరి జలాలను రాయలసీమకు తరలించేందుకు ఉద్దేశించిన బనకచర్ల ప్రాజెక్టును తమ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోందని తెలిపారు. ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణ ప్రయోజనాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని, దీనిని నిలువరించేందుకు అన్ని చట్టపరమైన మార్గాలను అనుసరిస్తామని ఆయన వివరించారు. ఇప్పటికే కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌తో ఈ విషయంపై చర్చించామని, అవసరమైతే సుప్రీంకోర్టును కూడా ఆశ్రయిస్తామని తేల్చిచెప్పారు.

తెలంగాణ జల హక్కులను కాపాడటంలో తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉత్తమ్ కుమార్ రెడ్డి పునరుద్ఘాటించారు. గోదావరి నదిపై ఇచ్చంపల్లితో పాటు ఇతర కొత్త ప్రాజెక్టులను నిర్మించి, గోదావరి బేసిన్‌లోని ఆయకట్టుకు పూర్తిస్థాయిలో సాగునీరు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. బనకచర్ల ప్రాజెక్టు విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు వెళితే, దానిని కచ్చితంగా అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ ప్రాజెక్టుపై పూర్తి వివరాలతో ఈ నెల 30న ప్రజాభవన్‌లో ఒక ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్లు మంత్రి వెల్లడించారు.
Go Back to Shorts
Uttam Kumar Reddy
Godavari Banakacherla Project
Telangana
Andhra Pradesh
water rights
irrigation project
CR Patil
Supreme Court
Ramagundam lift irrigation scheme

More Telugu News