ఇండియాతో మ్యాచ్ వివాదం.. లెజెండ్స్ లీగ్పై పాకిస్థాన్ నిషేధాస్త్రం!
- వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్లో ఆడకుండా పాక్ ఆటగాళ్లపై నిషేధం
- సెమీ-ఫైనల్లో పాక్తో ఆడేందుకు ఇండియా లెజెండ్స్ నిరాకరణ
- టోర్నీ నిర్వాహకుల తీరుపై పీసీబీ తీవ్ర ఆగ్రహం
- డబ్ల్యూసీఎల్ పక్షపాతంగా వ్యవహరించిందని పాక్ బోర్డు ఆరోపణ
- పీసీబీ వర్చువల్ సమావేశంలో కీలక నిర్ణయం
పీసీబీ చైర్మన్ మోహ్సిన్ నఖ్వీ అధ్యక్షతన వర్చువల్గా జరిగిన 79వ బోర్డు సమావేశంలో ఈ అంశంపై తీవ్రంగా చర్చించారు. ఇండియా లెజెండ్స్ జట్టు మ్యాచ్ ఆడకుండానే వైదొలిగినా, టోర్నీ నిర్వాహకులు వారికి పాయింట్లు కేటాయించడంపై పీసీబీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. డబ్ల్యూసీఎల్ విడుదల చేసిన పత్రికా ప్రకటనలు పక్షపాతంగా, ద్వంద్వ ప్రమాణాలతో ఉన్నాయని మండిపడింది.
"క్రీడల ద్వారా శాంతి అనే నినాదాన్ని కేవలం కొన్ని సందర్భాల్లోనే వాడుకుంటూ, రాజకీయ, వాణిజ్య ప్రయోజనాల కోసం క్రీడలను బలి చేస్తున్నారు. క్రీడాస్ఫూర్తికి, నిష్పక్షపాతానికి విఘాతం కలిగించే ఇలాంటి టోర్నీలలో పాల్గొనడాన్ని ఏమాత్రం సహించలేం. బయటి శక్తుల ప్రభావంతో క్రీడా నియమాలను ఉల్లంఘిస్తున్నందునే ఈ నిర్ణయం తీసుకున్నాం" అని పీసీబీ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.
ఈ టోర్నమెంట్ లీగ్ దశలో బర్మింగ్హామ్లో పాకిస్థాన్తో తలపడేందుకు భారత ఆటగాడు శిఖర్ ధావన్తో సహా పలువురు ఆటగాళ్లు విముఖత చూపిన విషయం తెలిసిందే. ఆ తర్వాత సెమీ-ఫైనల్లో కూడా మరోసారి పాక్తో ఆడాల్సి రావడంతో, మ్యాచ్ నుంచి పూర్తిగా తప్పుకోవాలని ఇండియా లెజెండ్స్ జట్టు నిర్ణయించుకుంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే డబ్ల్యూసీఎల్ తీరును నిరసిస్తూ పీసీబీ ఈ నిషేధ నిర్ణయాన్ని ప్రకటించింది.