త్వరలో నామినేటెడ్ పదవుల భర్తీ.. చంద్రబాబు కీలక ప్రకటన
- కష్టపడిన వారికి గుర్తింపు ఉంటుందన్న సీఎం చంద్రబాబు
- పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులతో టెలికాన్ఫరెన్స్
- అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై వివరణ
- కూటమి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని క్యాడర్ కు దిశానిర్దేశం
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. గతంలో తాము చేసిన కార్యక్రమాల గురించి ప్రజలకు చెప్పుకోలేక నష్టపోయామని అన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని పార్టీ క్యాడర్ కు సూచించారు. ఈ నెలలో అమలు చేయబోతున్న అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో నేతలు, కార్యకర్తలు అందరూ పాల్గొనాలని ఆయన ఆదేశించారు.
ఈ సందర్భంగా గత ప్రభుత్వంపై చంద్రబాబు విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనలో రైతులకు అన్యాయం జరిగిందని, మాజీ సీఎం వైఎస్ జగన్ రైతులను మోసం చేశారని ఆరోపించారు. రైతు భరోసా పేరుతో అన్నదాతలను వంచించారని ఆయన మండిపడ్డారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో రైతులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో కలిపి మొత్తం రూ.20 వేలు రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్టు చంద్రబాబు తెలిపారు.