Joe Root: లంచ్ బ్రేక్: లార్డ్స్ లో రూట్ సెంచరీ... బుమ్రాకు 4 వికెట్లు

Joe Root Century Bumrah Takes 4 Wickets at Lords
  • లార్డ్స్ టెస్టులో భారత్-ఇంగ్లండ్ టెస్టు మ్యాచ్
  • నేడు ఆటకు రెండో రోజు
  • లంచ్ సమయానికి 7 వికెట్లకు 353 పరుగులు చేసిన ఇంగ్లండ్ 
భారత్ తో జరుగుతున్న మూడో టెస్టు రెండో రోజు ఆటలో ఇంగ్లండ్ జట్టు లంచ్ విరామ సమయానికి తొలి ఇన్నింగ్స్ లో 7 వికెట్ల నష్టానికి 353 పరుగులు చేసింది. లార్డ్స్ మైదానంలో జో రూట్ (104) సెంచరీతో ఆకట్టుకోగా, భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బూమ్రా (4/63) తన పదునైన బౌలింగ్‌తో ఆతిథ్య జట్టును కట్టడి చేసే ప్రయత్నం చేశాడు.

సెంచరీ పూర్తి చేసిన వెంటనే బూమ్రా బౌలింగ్‌లో రూట్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాతి బంతికే క్రిస్ వోక్స్ (0)ను కూడా బూమ్రా పెవిలియన్ పంపడంతో ఇంగ్లండ్ ఒక్కసారిగా కష్టాల్లో పడింది. ఈ దశలో, వికెట్ కీపర్ జామీ స్మిత్ (51 నాటౌట్) వేగంగా ఆడి అర్ధ సెంచరీ సాధించగా, అతనికి బ్రైడన్ కార్స్ (33 నాటౌట్) చక్కటి సహకారం అందించాడు. లంచ్ సమయానికి వీరిద్దరూ క్రీజులో ఉన్నారు. కెప్టెన్ బెన్ స్టోక్స్ 44 పరుగులు చేసి బుమ్రా బౌలింగ్ లో వెనుదిరిగాడు. 

భారత బౌలర్లలో బూమ్రా నాలుగు వికెట్లతో సత్తా చాటగా, నితీశ్ రెడ్డి రెండు, జడేజా ఒక వికెట్ పడగొట్టారు. మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్‌లకు వికెట్లు దక్కలేదు. రెండో రోజు ఇంగ్లండ్‌ను ఎంత త్వరగా ఆలౌట్ చేస్తారనే టీమిండియా అవకాశాలు ఆధారపడి ఉన్నాయి.

ఇంగ్లండ్ జట్టు ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. నిన్న తొలి రోజు ఆటలో 4 వికెట్లకు 251 పరుగులు చేసింది. ఇవాళ మరో 3 వికెట్లు చేజార్చుకుని 102 పరుగులు జతచేసింది.
Joe Root
Joe Root century
Jasprit Bumrah
India vs England
Lords Test
England batting
Jamie Smith
Nitish Reddy
Ben Stokes
Cricket news

More Telugu News