చంద్రబాబు, పవన్, లోకేశ్ లకు ధన్యవాదాలు: ప్రశాంతి రెడ్డి
- నెల్లూరు రాజకీయాల్లో నల్లపరెడ్డి, ప్రశాంతి రెడ్డి మాటల యుద్ధం
- ప్రశాంతి రెడ్డికి మద్దతుగా నిలిచిన కూటమి నేతలు, ప్రజా సంఘాలు
- నల్లపరెడ్డి మాటల దాడిని ఖండించిన ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటానన్న ప్రశాంతి రెడ్డి
ఈ కష్ట సమయంలో తనకు అండగా నిలిచిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ లకు ఆమె ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. సభ్య సమాజం తలదించుకునేలా తనపై జరిగిన మాటల దాడిని ఖండిస్తూ అండగా నిలిచిన తెలుగుదేశం కుటుంబసభ్యులకు, ప్రజానీకానికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఆమె పేర్కొన్నారు.
వీరితో పాటు మంత్రులు, ఎంపీలు, తోటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు, పార్టీ నేతలకు పేరుపేరునా కృతజ్ఞతలు చెప్పారు. తన కోసం క్షేత్రస్థాయిలో పోరాడిన మహిళలకు, జిల్లావ్యాప్తంగా తరలివచ్చి సంఘీభావం ప్రకటించిన తన భర్త వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి అభిమానులకు, కోవూరు నియోజకవర్గ కూటమి నాయకులకు తాను రుణపడి ఉంటానని స్పష్టం చేశారు. మీడియా మిత్రులకు కూడా ఆమె ధన్యవాదాలు తెలిపారు.
అందరి మద్దతుతో మనోధైర్యాన్ని కూడగట్టుకుని, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రశాంతి రెడ్డి ఆ వీడియోలో భరోసా ఇచ్చారు.