Paritala Sriram: సుపరిపాలనలో తొలి అడుగు... ఇది ఆరంభం మాత్రమేనన్న పరిటాల శ్రీరామ్

Paritala Sriram Says Good Governance is Just the Beginning
  • ధర్మవరంలో 'సుపరిపాలన తొలి అడుగు' కార్యక్రమం ప్రారంభం
  • ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ ఏడాది పాలనను వివరించిన పరిటాల శ్రీరామ్
  • పథకాలపై ప్రజల సంతృప్తి... రేషన్ కార్డుల సమస్యపై కొందరి ఫిర్యాదు
  • సమస్యలు పరిష్కరిస్తామని గ్రామస్థులకు శ్రీరామ్ హామీ
  • గత పాలనపై విమర్శలు... అమరావతి, పోలవరం పనులపై హర్షం
ప్రభుత్వ తొలి ఏడాది పాలనలో ప్రజలు చూసిన అభివృద్ధి కేవలం ఆరంభం మాత్రమేనని, రాబోయే నాలుగేళ్లలో ఊహించని రీతిలో అభివృద్ధి చేసి చూపిస్తామని ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ ఛార్జి పరిటాల శ్రీరామ్ అన్నారు. ధర్మవరం రూరల్ మండలంలోని చిగిచెర్ల గ్రామంలో మంగళవారం నాడు 'సుపరిపాలన తొలి అడుగు' కార్యక్రమాన్ని నిర్వహించారు. నియోజకవర్గ టీడీపీ పరిశీలకులు నాగేంద్రతో కలిసి ఆయన ఇంటింటికీ తిరుగుతూ, ఏడాది కాలంలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.

ఈ సందర్భంగా గ్రామస్థుల నుంచి పరిటాల శ్రీరామ్‌కు సానుకూల స్పందన లభించింది. ప్రభుత్వం అందిస్తున్న పథకాలు చాలా వరకు తమకు అందుతున్నాయని ప్రజలు తెలిపారు. ముఖ్యంగా, తమ పిల్లలందరికీ రూ.15 వేల చొప్పున ఆర్థిక సాయం అందడం పట్ల మహిళలు సంతోషం వ్యక్తం చేశారు. అయితే, కొంతమంది తమకు రేషన్ కార్డులు లేకపోవడం వల్ల ప్రభుత్వ పథకాలకు దూరమవుతున్నామని ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ఈ సమస్యలను అధికారులతో మాట్లాడి వెంటనే పరిష్కరిస్తానని శ్రీరామ్ వారికి భరోసా ఇచ్చారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ, "ఏడాది పాలనపై ప్రజల్లో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. మేము కేవలం చేసినవి చెప్పుకోవడానికే రాలేదు, ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకే ఈ కార్యక్రమం చేపట్టాం" అని తెలిపారు. గత ఐదేళ్ల విధ్వంసకర పాలనతో రాష్ట్రం తిరోగమనంలోకి వెళ్లిందని, ముఖ్యమంత్రి చంద్రబాబు ఏడాది కాలంలోనే రాష్ట్రాన్ని మళ్లీ అభివృద్ధి బాట పట్టించారని ప్రశంసించారు. పోలవరం, రాజధాని అమరావతి నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని, ప్రజలకు ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చి చూపిస్తామని ఆయన స్పష్టం చేశారు.
Paritala Sriram
Dharmavaram
TDP
Chandrababu Naidu
Andhra Pradesh Development
Good Governance
Welfare Schemes
Chigicherla Village
Ration Cards
Polavaram Project

More Telugu News