జీ7 వేదికగా ఏఐ డీప్ఫేక్లపై ప్రధాని మోదీ ఆందోళన
- ఏఐ రూపొందించిన కంటెంట్కు వాటర్మార్క్ ఉండాలని సూచన
- ఏఐ సమస్యల పరిష్కారానికి ప్రపంచస్థాయి పాలన అవశ్యమని ఉద్ఘాటన
- పునరుత్పాదక ఇంధన వనరులతోనే సాంకేతికత ఆధారిత సమాజ నిర్మాణం సాధ్యమని వెల్లడి
- భారత్ టెక్నాలజీని ప్రజలకు చేరువ చేసి ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసిందని వివరణ
సమాజంపై ఏఐ చూపిస్తున్న ప్రభావం గురించి ప్రస్తావిస్తూ, ఈ సాంకేతికతకు సంబంధించిన సమస్యలను తగ్గించడానికి ప్రపంచవ్యాప్తంగా సమగ్రమైన పాలనా వ్యవస్థ అవసరమని ప్రధాని మోదీ సూచించారు. ప్రస్తుత యుగం ఏఐదే అయినప్పటికీ, సాంకేతికతతో కూడిన వ్యవస్థలను సురక్షితంగా కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని ఆయన నొక్కిచెప్పారు. డీప్ఫేక్ కంటెంట్ వల్ల తలెత్తే ప్రమాదాలను తగ్గించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు.
ప్రజలకు అందుబాటు ధరల్లో, నమ్మకమైన, స్థిరమైన సాంకేతిక వ్యవస్థలను అందించడమే భారత్ ప్రధాన లక్ష్యమని మోదీ స్పష్టం చేశారు. సాంకేతిక పరిజ్ఞానం ప్రజలకు ప్రయోజనం చేకూర్చినప్పుడే దానికి నిజమైన విలువ ఉంటుందని ప్రధాని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో ఏ దేశాన్ని కూడా వెనుకబడనివ్వకూడదని ఆయన అన్నారు.
భారత్ తన సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రజాస్వామ్యబద్ధం చేసిందని, తద్వారా ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయడంతో పాటు, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా సామాన్య ప్రజలను కూడా శక్తివంతం చేసిందని ఆయన వివరించారు. ఈ సందర్భంగా సమగ్రమైన, సామర్థ్యవంతమైన, బాధ్యతాయుతమైన ఏఐ వ్యవస్థ ఆవశ్యకతను ఆయన నొక్కి చెప్పారు.