Rohingya: సముద్రంలో మునిగిన రెండు ఓడలు.. 427 మంది రోహింగ్యాలు జలసమాధి?

Rohingya Two Boats Sink 427 Feared Dead in Myanmar Coast
షార్ట్స్‌లో చూడండి
మయన్మార్‌ తీర ప్రాంతంలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. రోహింగ్యా శరణార్థులతో వెళ్తున్న రెండు ఓడలు మునిగిపోయాయి. ఈ ఘోర దుర్ఘటనల్లో సుమారు 427 మంది ప్రాణాలు కోల్పోయి ఉంటారని ఐక్యరాజ్య సమితి (ఐరాస) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ వార్త నిజమైతే, ఇటీవలి కాలంలో సముద్రంలో జరిగిన అతి పెద్ద విషాదాల్లో ఒకటిగా ఇది నిలిచిపోతుందని ఐరాస పేర్కొంది.

ఐక్యరాజ్య సమితి అందించిన ప్రాథమిక సమాచారం ప్రకారం, మే 9వ తేదీన జరిగిన మొదటి ప్రమాదంలో ఒక నౌక మునిగిపోయింది. ఇందులో ప్రయాణిస్తున్న 267 మందిలో కేవలం 66 మంది మాత్రమే ప్రాణాలతో బయటపడి ఉంటారని తెలిపింది. మిగిలిన వారు గల్లంతయ్యారు.

ఆ తర్వాత మే 10వ తేదీన మరో నౌక కూడా ఇదే విధంగా ప్రమాదానికి గురైంది. ఈ రెండో నౌకలో ఉన్న వారిలో 21 మంది మాత్రమే సురక్షితంగా ఒడ్డుకు చేరారని సమాచారం. ఈ రెండు ఘటనల్లో కలిపి మొత్తం 427 మంది మరణించి ఉండవచ్చని ఐరాస అంచనా వేస్తోంది. ఈ ప్రమాదాలకు గల కచ్చితమైన కారణాలపై ఐరాసకు అనుబంధంగా పనిచేస్తున్న శరణార్థి విభాగం విశ్లేషణ జరుపుతున్నట్లు సమాచారం.

మయన్మార్‌లో నివసించే రోహింగ్యాలు అనేక సంవత్సరాలుగా వివక్షకు, హింసకు గురవుతున్నారు. 2017లో మయన్మార్‌ సైన్యం చేపట్టిన కఠిన చర్యల కారణంగా లక్షలాది మంది రోహింగ్యాలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పొరుగున ఉన్న బంగ్లాదేశ్‌కు వలస వెళ్లారు. అక్కడ ఏర్పాటు చేసిన శరణార్థి శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. అయితే, గత ఏడాది మయన్మార్‌లో సైనిక తిరుగుబాటు జరిగిన అనంతరం, రోహింగ్యాలపై దాడులు, అణచివేత మరింత పెరిగాయని వార్తలు వస్తున్నాయి.

దీంతో, బంగ్లాదేశ్‌లోని శిబిరాల్లో ఇప్పటికే కిక్కిరిసిపోయిన జనాభా, అక్కడి దుర్భర పరిస్థితుల కారణంగా అనేకమంది రోహింగ్యాలు ఇతర దేశాలకు వలస వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే, వారు ఏజెంట్ల మాటలు నమ్మి, ప్రమాదకరమైన సముద్ర మార్గాల ద్వారా ఇండోనేషియా, మలేషియా వంటి దేశాలకు చేరుకోవాలని చూస్తున్నారు. ఇలాంటి ప్రయాణాల్లోనే తరచూ ప్రమాదాలు జరిగి అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.
Go Back to Shorts
Rohingya
Rohingya refugees
Myanmar
Bangladesh
boat accident
shipwreck
Bay of Bengal

More Telugu News