Wife kills husband Uttar Pradesh: తన ముగ్గురు ప్రియుళ్ల సాయంతో భర్తను ఆరు ముక్కలుగా నరికి చంపిన భార్య

Wife Kills Husband with Three Lovers Cuts Body into Six Pieces
  • బల్లియాలో 62 ఏళ్ల రిటైర్డ్ ఉద్యోగి దారుణ హత్య
  • భార్య, ఆమె ముగ్గురు ప్రియులే ఈ ఘాతుకానికి పాల్పడినట్టు నిర్ధారణ
  • మృతదేహాన్ని ఆరు ముక్కలు చేసి వివిధ ప్రాంతాల్లో పడేసిన వైనం
  • భార్య సహా నలుగురు నిందితుల అరెస్ట్, ఒకరిపై కాల్పులు
ఉత్తరప్రదేశ్‌లోని బల్లియాలో సభ్యసమాజం తలదించుకునే దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కట్టుకున్న భార్యే తన ముగ్గురు ప్రియులతో కలిసి భర్తను అత్యంత కిరాతకంగా హత్య చేసింది. అనంతరం మృతదేహాన్ని ఆరు ముక్కలుగా నరికి, వివిధ ప్రాంతాల్లో పడేసి నేరాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేసింది. ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్‌లో ఎలక్ట్రీషియన్‌గా పనిచేసి రిటైర్ అయిన 62 ఏళ్ల దేవేంద్ర రామ్‌ను ఆయన భార్య మాయ (55), ఆమె ప్రియులు మిథిలేష్ పటేల్, అనిల్ యాదవ్, సతీష్ యాదవ్‌లు (అందరూ 30 ఏళ్ల వయసువారే) కలిసి దారుణంగా హత్య చేశారు. మే 10వ తేదీన సికందర్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖరీద్ గ్రామంలోని ఓ పొలంలో మానవ శరీర భాగాలు లభ్యం కావడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ఆ ప్రాంతంలో దుర్వాసన వస్తుండటంతో గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు.

విచారణ చేపట్టిన పోలీసులు, అదే రోజు సాయంత్రం తన భర్త కనిపించడం లేదంటూ కోత్వాలి పోలీసులకు మాయ ఫిర్యాదు చేయడంతో అనుమానం వ్యక్తం చేశారు. బీహార్‌లోని బక్సర్ రైల్వే స్టేషన్‌కు తమ కుమార్తెను తీసుకురావడానికి వెళ్లిన భర్త తిరిగి రాలేదని, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోందని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. అయితే, మృతుడి ఫోన్ ఇంట్లోనే లభించడంతో పాటు, ఇతర ఆధారాలు లభించడంతో పోలీసులు మాయను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజం బయటపడింది. మిథిలేష్, అనిల్, సతీష్‌లతో తనకు వివాహేతర సంబంధం ఉందని, వారితో కలిసి పక్కా ప్రణాళిక ప్రకారమే దేవేంద్ర రామ్‌ను మే 8న హత్య చేసినట్లు ఆమె అంగీకరించింది.

మాయ ఇచ్చిన సమాచారంతో పోలీసులు మిథిలేష్ పటేల్‌ను అరెస్ట్ చేశారు. దర్యాప్తులో భాగంగా ఓ బావిలో దేవేంద్ర రామ్ మొండెం లభించింది. పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితులు అనిల్ యాదవ్, సతీష్ యాదవ్‌లను మంగళవారం ఉదయం పరిఖ్రా జైలు ప్రాంతంలోని టౌన్ పాలిటెక్నిక్ వద్ద పోలీసులు పట్టుకునేందుకు ప్రయత్నించగా, వారు పోలీసులపై కాల్పులు జరిపారు. పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో అనిల్ యాదవ్‌కు బుల్లెట్ గాయమైంది. అనంతరం ఇద్దరినీ అరెస్ట్ చేశారు. విచారణలో వారు కూడా నేరాన్ని అంగీకరించారు. వారిచ్చిన సమాచారం ఆధారంగా హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని ఆరు ముక్కలుగా నరికినట్లు నిందితులు తెలిపారని, తల భాగాన్ని ఘాఘ్రా నదిలో పడేసినట్లు చెప్పారని బల్లియా ఎస్పీ ఓంవీర్ సింగ్ తెలిపారు. తల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని ఆయన వివరించారు.

దేవేంద్ర రామ్ 2023లో ఉద్యోగ విరమణ చేశారు. ఆయనకు బహదూర్‌పూర్ ప్రాంతంలో ఇల్లు ఉండగా, అక్కడ భార్య మాయ ఒంటరిగా నివసించేది. వారి పెద్ద కుమార్తె జైపూర్‌లో, చిన్న కుమార్తె పోటీ పరీక్షలకు సిద్ధమవుతూ కోటాలో, కుమారుడు హాస్టల్‌లో ఉంటున్నారు. దేవేంద్ర రామ్ తరచూ ఖేజురి ప్రాంతంలోని తన పూర్వీకుల గ్రామమైన హరిపూర్‌కు వెళ్లి వస్తూ, అప్పుడప్పుడు నగరంలోని తన ఇంటికి వచ్చేవారని తెలిసింది. ఈ పరిస్థితులే దారుణానికి దారితీసి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Wife kills husband Uttar Pradesh
Ballia murder case
Devendra Ram murder
Maya Devi
Mithilesh Patel
Anil Yadav
Satish Yadav
Uttar Pradesh crime
Brutal murder
India crime news

More Telugu News