భారత్-పాక్ ఉద్రిక్తతలు: 80వేల దిగువకు సెన్సెక్స్

Tensions between India and Pakistan Drag Sensex Below 80000
భారత్, పాకిస్థాన్‌ల మధ్య సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు దేశీయ స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపాయి. పాకిస్థాన్ దళాలు సరిహద్దు ప్రాంతాలపై దాడులకు పాల్పడటం, భారత సైన్యం వాటిని సమర్థంగా తిప్పికొట్టడంతో యుద్ధ భయాలు మరింత ముదిరాయి. ఈ పరిణామాల నేపథ్యంలో మదుపర్లు అమ్మకాలకు మొగ్గు చూపడంతో దేశీయ సూచీలు వరుసగా రెండో రోజూ కూడా భారీ నష్టాలను చవిచూశాయి. దాదాపు అన్ని రంగాల షేర్లూ అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. దీంతో సెన్సెక్స్ కీలకమైన 80 వేల పాయింట్ల మార్కును కోల్పోగా, నిఫ్టీ 24 వేల పాయింట్ల సమీపంలో ముగిసింది.

సరిహద్దు ఉద్రిక్తతల కారణంగా విమానయానం, పర్యాటకం, స్థిరాస్తి వంటి రంగాల షేర్లు అధికంగా నష్టపోయాయి. అయితే, రక్షణ రంగ సంస్థల షేర్లలో కొనుగోళ్ల ఆసక్తి కనిపించింది. ముఖ్యంగా డ్రోన్ల తయారీ సంస్థ ఐడియా ఫోర్జ్‌ షేర్లు ఏకంగా 18 శాతం వరకు లాభపడ్డాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్‌ సూచీ దాదాపుగా స్థిరంగా ముగియగా, స్మాల్‌క్యాప్‌ సూచీ 0.61 శాతం నష్టపోయింది.

ఉదయం సెన్సెక్స్ 78,968.34 పాయింట్ల వద్ద నష్టాలతో ప్రారంభమైంది. రోజంతా నష్టాల్లోనే కొనసాగిన సూచీ, ఇంట్రాడేలో 78,968.34 పాయింట్ల కనిష్ఠ స్థాయిని తాకింది. చివరికి 880.34 పాయింట్ల నష్టంతో 79,454.47 వద్ద స్థిరపడింది. నిఫ్టీ కూడా 265 పాయింట్లు నష్టపోయి 24,008 వద్ద ముగిసింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 17 పైసలు బలపడి 85.41 వద్ద నిలిచింది.

సెన్సెక్స్ 30 సూచీలో ఐసీఐసీఐ బ్యాంక్‌, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు ప్రధానంగా నష్టపోయిన వాటిలో ఉన్నాయి. టైటాన్‌, టాటా మోటార్స్‌, ఎల్ అండ్ టీ, ఎస్బీఐ, ఏషియన్‌ పెయింట్స్‌ షేర్లు లాభాలతో ముగిశాయి.
Go Back to Shorts
India-Pakistan tensions
Sensex
Nifty
Stock Market Crash
India Pakistan Border
Defense Stocks

More Telugu News