తెలంగాణ హైకోర్టు సిట్టింగ్ జడ్జి జస్టిస్ గిరిజా ప్రియదర్శిని కన్నుమూత

Sitting judge of Telangana High Court passes away
తెలంగాణ హైకోర్టు సిట్టింగ్ జడ్జి జస్టిస్ మాటూరి గిరిజా ప్రియదర్శిని (61) ఆదివారం ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. ఆమె వయసు 61 సంవత్సరాలు.

జస్టిస్ ప్రియదర్శిని భౌతికకాయాన్ని హఫీజ్‌పేటలోని ఆమె నివాసంలో ఉంచారు. అంత్యక్రియలు సోమవారం నాడు జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. జస్టిస్ ప్రియదర్శిని మృతి పట్ల హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్ పాల్, ఇతర న్యాయమూర్తులు, న్యాయవాదులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు.

1995లో న్యాయవాదిగా తన వృత్తిని ప్రారంభించిన జస్టిస్ ప్రియదర్శిని, విశాఖపట్నంలో సివిల్, క్రిమినల్, లేబర్ లా, వైవాహిక వివాదాలకు సంబంధించిన కేసులను వాదించారు. 2008 నవంబర్‌లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా జిల్లా జడ్జిగా ఎంపికై న్యాయ సేవలో చేరారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో అదనపు జిల్లా జడ్జిగా సేవలందించారు. అనంతరం పదోన్నతి పొంది, 2022 మార్చి 24న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. సీనియారిటీ ప్రకారం ఆమె 16వ స్థానంలో ఉన్నారు. వచ్చే ఏడాది ఆమె పదవీ విరమణ చేయాల్సి ఉంది.

విశాఖపట్నం ఎన్‌బీఎం లా కాలేజీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందిన ఆమె, ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి లేబర్ అండ్ ఇండస్ట్రియల్ లాలో ఎల్ఎల్‌ఎం పూర్తి చేశారు. అంతకుముందు సోషియాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్‌లలో మాస్టర్స్ డిగ్రీలు కూడా పొందారు. ఆమె తండ్రి మాతురి అప్పారావు వాణిజ్య పన్నుల శాఖ అధికారిగా పనిచేశారు. జస్టిస్ ప్రియదర్శినికి భర్త డాక్టర్ కె. విజయ్ కుమార్, ఇద్దరు కుమారులు నిఖిల్, అఖిల్ ఉన్నారు.
Go Back to Shorts
Justice Girija Priya Darsini
Telangana High Court
Judge
Death
Hyderabad
Maturi Girija Priya Darsini
Justice Sujoy Paul
NBM Law College Visakhapatnam
Andhra University
Legal Profession

More Telugu News