సింహాచలం బాధితులకు జగన్ పరామర్శ, సర్కారుపై ధ్వజం

Jagan Visits Simhachalam Victims Blasts Govt
సింహాచలంలో జరిగిన ప్రమాదంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. బుధవారం ఆయన విశాఖపట్నం జిల్లా సింహాచలంలో గోడ కూలి మరణించిన వారి కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా ప్రస్తుత ప్రభుత్వ తీరుపై, ముఖ్యంగా చందనోత్సవం ఏర్పాట్లపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు.

పర్యటన అనంతరం మీడియాతో మాట్లాడిన జగన్, ఈ దురదృష్టకర సంఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోవడం, అందులోనూ ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఉండటం అత్యంత బాధాకరమని అన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. లక్షలాది మంది భక్తులు వస్తారని తెలిసినా, ప్రభుత్వం చందనోత్సవానికి కనీస ఏర్పాట్లు చేయడంలో విఫలమైందని, భక్తులకు సౌకర్యాలు కూడా కల్పించలేదని ఆయన ఆరోపించారు.

ప్రమాదానికి కారణమైన గోడ నిర్మాణంపై జగన్ పలు ప్రశ్నలు లేవనెత్తారు. కేవలం ఆరు రోజుల క్రితం నిర్మాణం ప్రారంభించి, రెండు రోజుల క్రితమే పూర్తి చేసిన పది అడుగుల ఎత్తు, డెబ్బై అడుగుల పొడవున్న ఈ గోడ నిర్మాణానికి కనీసం టెండర్లు కూడా పిలవలేదని ఆరోపించారు. కాంక్రీట్‌తో నిర్మించాల్సిన గోడను ఫ్లైయాష్ ఇటుకలతో నాణ్యత లేకుండా కట్టారని విమర్శించారు. వర్షం పడుతుందని తెలిసి కూడా, కొత్తగా కట్టిన ఆ గోడ పక్కనే క్యూలైన్లు ఏర్పాటు చేయడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు. "చందనోత్సవం ఎప్పుడు జరుగుతుందో ప్రభుత్వానికి తెలియదా? తెలిసి కూడా  ఎందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదు? " అని జగన్ ప్రశ్నించారు.

చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఆలయాల్లో ఇలాంటి దారుణాలు జరగడం దురదృష్టకరమని జగన్ వ్యాఖ్యానించారు. గతంలో తిరుపతిలో వైకుంఠ ఏకాదశి నాడు జరిగిన తోపులాటలో ఆరుగురు మరణించారని, తిరుమల లడ్డూ ప్రసాదంపై రాజకీయ లబ్ధి కోసం తప్పుడు ప్రచారం చేశారని, గోశాలలో గోవులు మరణించాయని, కాశినాయన గుడిని కూల్చివేశారని, శ్రీకూర్మం ఆలయంలో తాబేళ్లు మృతి చెందాయని, గోదావరి పుష్కరాల్లో 29 మంది మరణించారని ఆయన గుర్తు చేశారు. ఇన్ని సంఘటనలు జరుగుతున్నా బాధ్యులపై చర్యలు తీసుకోవడం లేదని, ఎందుకంటే అన్నింటిలోనూ చంద్రబాబు పాత్ర ఉందని, అందుకే ప్రజల దృష్టి మరల్చే రాజకీయాలు చేస్తున్నారని జగన్ ఆరోపించారు. ఈ ఘటనలో కూడా తమపై నిందలు వేసే ప్రయత్నం చేశారని, కానీ గోడ తమ హయాంలో కాకుండా రెండు రోజుల క్రితమే కట్టిందని తేలిపోయిందని అన్నారు.

ప్రభుత్వం ప్రకటించిన రూ. 25 లక్షల పరిహారం సరిపోదని, అది కూడా తాను వస్తున్నానని తెలిసి మొక్కుబడిగా ప్రకటించారని జగన్ విమర్శించారు. ప్రభుత్వ తప్పిదం స్పష్టంగా కనిపిస్తున్నందున పరిహారాన్ని గణనీయంగా పెంచాలని డిమాండ్ చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే బాధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కేవలం పరిహారం ప్రకటించడమే కాకుండా, ఈ దుర్ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటేనే భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కావని ప్రభుత్వానికి హితవు పలికారు.
Go Back to Shorts
Jagan Mohan Reddy
Simhachalam wall collapse
Andhra Pradesh
Visakhapatnam
Chandanothsavam
Government negligence
Wall construction
Compensation
Political criticism
YSR Congress Party

More Telugu News