Rukhsaar: పిల్లలు పాక్ కు.. తల్లి భారత్ లోనే.. అటారీ సరిహద్దులో పిల్లల కోసం తల్లి ఆరాటం

Emotional separation Rukhsar trapped at Attari border as her children reach Pakistan
  • అటారీ సరిహద్దులో రుఖ్సార్ అనే మహిళకు పాక్ ప్రవేశం నిరాకరణ
  • పాక్ పాస్‌పోర్ట్‌లున్న నలుగురు పిల్లలు, భర్త పాకిస్థాన్‌ చేరిక
  • రుక్సార్ భారత పాస్ పోర్ట్ కలిగి ఉండటంతో పాక్ ప్రవేశం నిరాకరణ
  • ఢిల్లీలో తల్లిని చూసి తిరిగి వెళుతుండగా ఘటన
  • పిల్లల వద్దకు పంపాలని భారత ప్రభుత్వానికి రుఖ్సార్ విజ్ఞప్తి
అటారీ సరిహద్దు వద్ద హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. కన్న బిడ్డలకు దూరమై ఓ తల్లి పడుతున్న వేదన చూపరులను కంటతడి పెట్టిస్తోంది. పాకిస్థాన్‌లోని తన కుటుంబం వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించిన రుఖ్సార్ అనే మహిళకు నిరాశే ఎదురైంది. పాస్‌పోర్ట్ సమస్యల కారణంగా ఆమెను అధికారులు సరిహద్దు వద్ద నిలిపివేయగా, ఆమె నలుగురు పిల్లలు మాత్రం పాకిస్థాన్ చేరుకున్నారు. దీంతో తన బిడ్డలకు దూరమై రుఖ్సార్ తీవ్ర ఆవేదన చెందుతున్నారు.

వివరాల్లోకి వెళితే, రుఖ్సార్ భారత పౌరురాలు కాగా, ఆమె భర్త, నలుగురు పిల్లలు పాకిస్థాన్ పౌరులు. దాదాపు 13 ఏళ్ల తర్వాత రుఖ్సార్ ఇటీవల ఢిల్లీలోని తన తల్లిని చూసేందుకు భారత్ వచ్చారు. తిరిగి పాకిస్థాన్‌లోని తన పిల్లలు, భర్త వద్దకు వెళ్లేందుకు అటారీ సరిహద్దుకు చేరుకున్నారు. అయితే, రుఖ్సార్ వద్ద భారత పాస్‌పోర్ట్ ఉండగా, ఆమె పిల్లల వద్ద పాకిస్థానీ పాస్‌పోర్ట్‌లు ఉన్నాయి. ఈ కారణంగా, పాక్ అధికారులు పిల్లలను వారి తండ్రితో పాటు తమ దేశంలోకి అనుమతించారు కానీ, భారత పాస్‌పోర్ట్ ఉన్న రుఖ్సార్ ప్రవేశానికి మాత్రం నిరాకరించారు.

దీంతో తన నలుగురు పిల్లలు, ముఖ్యంగా మూడేళ్ల చిన్న కుమార్తెకు దూరంగా రుఖ్సార్ సరిహద్దు వద్దే నిలిచిపోవాల్సి వచ్చింది. కళ్లముందే పిల్లలు పాకిస్థాన్ వెళ్లిపోవడం, తాను మాత్రం ఇక్కడ ఒంటరిగా మిగిలిపోవడంతో ఆమె కన్నీరుమున్నీరయ్యారు.

"నాకు నలుగురు పిల్లలు. చిన్న పాప వయసు కేవలం మూడేళ్లే. వాళ్లంతా వాళ్ల నాన్నతో కలిసి పాకిస్థాన్ వెళ్లిపోయారు. తల్లిని అయిన నేను లేకుండా నా బిడ్డలు ఎలా ఉండగలరు? వారి ఆలనాపాలనా చూడటానికి నేను కావాలి కదా? నేను నా పిల్లలతో ఉండాలి" అంటూ రుఖ్సార్  తన ఆవేదన వెళ్లగక్కారు.

"పదమూడేళ్ల తర్వాత మా అమ్మను చూడ్డానికి వచ్చాను. కానీ ఇప్పుడు ఇలా సరిహద్దులో చిక్కుకుపోయాను. నా పిల్లలు పాకిస్థాన్‌లో ఉన్నారు. వారికి దూరంగా నేను ఉండలేను. దయచేసి నన్ను నా పిల్లల వద్దకు, నా భర్త వద్దకు పాకిస్థాన్ పంపించండి. నేను వారిని చూసుకోవాలి" అని ఆమె భారత ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
Rukhsaar
India Pakistan Border
Attari Border
Passport Issue
Family Separation
Child Separation
Pakistan
India
Humanitarian Crisis
International Border

More Telugu News