ప్రకాశం జిల్లాలో ఘోరం... ఇన్సూరెన్స్ డబ్బు కోసం చెల్లినే చంపి యాక్సిడెంట్ అని చెప్పాడు!

Man killed sister for insurance money in Prakasam District
  • తోడబుట్టిన చెల్లిని అంతమొందించిన అన్న
  • కారు ప్రమాదంలో చనిపోయిందని నమ్మించే యత్నం
  • గతేడాది జరిగిన ఘటన
  • స్థానిక పోలీసు అధికారికి అనుమానం
  • మళ్లీ దర్యాప్తు చేస్తే బయటపడిన అన్న దురాగతం
మానవతా విలువల సంగతి అటుంచి, రక్తసంబంధాలను కూడా డబ్బు కోసం బలిచేస్తూ ఘోరాలకు పాల్పడుతున్న ఘటనలు తెలిసిందే. ప్రకాశం జిల్లాలో ఓ అన్న ఇన్సూరెన్స్ డబ్బు కోసం సొంత చెల్లినే చంపి యాక్సిడెంట్ అని నమ్మించే ప్రయత్నం చేశాడు. పొదిలి మండలం కాటూరివారిపాలెంలో ఈ దారుణం జరిగింది. 

చెల్లి ప్రమాదంలో చనిపోయిందని నమ్మిస్తే, రూ.1.20 కోట్ల ఇన్సూరెన్స్ డబ్బు లభిస్తుందని దురాశకు లోనైన ఆమె సోదరుడు ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. ఈ ఘటన గతేడాది ఫిబ్రవరిలో జరగ్గా, ఏడాది తర్వాత పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. 

కాటూరివారిపాలెంకు చెందిన అశోక్ రెడ్డి, సంధ్య అన్నాచెల్లెళ్లు. అశోక్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి అప్పులపాలయ్యాడు. సంధ్యకు పెళ్లయినప్పటికీ, గర్భకోశ సమస్యల వల్ల పిల్లలు పుట్టే అవకాశం లేకపోవడంతో పుట్టింట్లోనే ఉంటోంది. అయితే, తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న అశోక్ రెడ్డి పక్కా ప్లాన్ తో చెల్లెలి పేరిట ఇన్స్యూరెన్స్ తీసుకున్నాడు. తనే ఇన్స్యూరెన్స్ ప్రీమియం చెల్లిస్తూ వచ్చాడు. ఆమె ప్రమాదంలో చనిపోతే, ఆ డబ్బంతా తనకు వస్తుందని భావించాడు. 

ఈ క్రమంలో 2024 ఫిబ్రవరి 2న చెల్లెలిని హత్య చేశాడు. అనంతరం యాక్సిడెంట్ లో చనిపోయిందని అందరినీ నమ్మించే ప్రయత్నం చేశాడు. చెల్లెలిని తీసుకువస్తుండగా కారు చెట్టుకు ఢీకొట్టడంతో చనిపోయిందని అందరికీ చెప్పాడు. ఆ సమయంలో తానే డ్రైవ్ చేస్తున్నట్టు తెలిపాడు. చెల్లెలు సంధ్యను మత్తు మాత్రలు ఇచ్చి చంపినట్టు తెలుస్తోంది. 

పలు కేసులను రీఓపెన్ చేసే సమయంలో స్థానిక పోలీసు అధికారికి ఈ కేసులో అనుమానాలు కలిగాయి. మళ్లీ మొదటి నుంచి దర్యాప్తు చేయగా... అశోక్ రెడ్డి దురాగతం వెల్లడైంది. నిందితుడ్ని అరెస్ట్ చేసిన ప్రకాశం జిల్లా పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు.
Advertisement
Brother Killed Sister
Insurance
Prakasam District
Police

More Telugu News