మీర్‌పేటలో భార్య హత్య... వెబ్ సిరీస్‌లో చూసి ముక్కలుగా నరికాడు!

ex serviceman kills wife and cooks parts in pressure cooker
  • మరో మహిళతో ఉండేందుకే భార్యను హత్య చేసిన గురుమూర్తి
  • సంక్రాంతికి పిల్లలను తన సోదరి ఇంటికి పంపించి హత్య
  • ఆరు నెలల క్రితం చూసిన వెబ్ సిరీస్‌లో ఉన్నట్లుగా ముక్కలుగా నరికేశాడు
హైదరాబాద్‌లోని మీర్‌పేటలో భార్యను హత్య చేసిన కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. నిందితుడు గురుమూర్తి మరో మహిళతో కలిసి ఉండేందుకే తన భార్యను హత్య చేసినట్లుగా పోలీసుల విచారణలో వెల్లడైంది. ఓ వెబ్ సిరీస్ ప్రేరణతో తన భార్యను కిరాతకంగా హత్య చేసినట్లుగా తెలుస్తోంది. 

భార్యను హత్య చేసి, ముక్కలుగా నరికి, శరీర భాగాలను బకెట్ నీళ్లలో వేసి హీటర్‌తో ఉడికించి మాంసాన్ని ముద్దగా చేసి చెరువులో వేశాడు. నిందితుడి ఫోన్‌ను పరిశీలించగా మరో మహిళతో ఉన్న ఫొటోలు లభ్యమయ్యాయి. ఈ దారుణ హత్య తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది.

గురుమూర్తి ఏపీలోని ప్రకాశం జిల్లా రాచర్ల మండలం జేపీ చెరువు గ్రామానికి చెందినవాడు. 13 ఏళ్ల క్రితం అతనికి వెంకటమాధవితో వివాహమైంది. గురుమూర్తి ఆర్మీలో జవాన్‌గా పని చేసి నాయక్ సుబేదార్‌గా పదవీ విరమణ పొందాడు. ప్రస్తుతం కంచన్‌భాగ్ డీఆర్డీవోలో కాంట్రాక్ట్ భద్రతా సిబ్బందిగా పని చేస్తున్నాడు. కొన్నాళ్లుగా అతను మరో మహిళతో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు. విషయం భార్యకు తెలియడంతో ఇంట్లో గొడవలు జరిగాయి.

దీంతో గురుమూర్తి భార్యను అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు. సంక్రాంతి సందర్భంగా తన ఇద్దరు పిల్లలను హైదరాబాద్‌లోనే ఉండే తన సోదరి ఇంటికి పంపించాడు. ఈ నెల 15న భార్యాభర్తలకు మరోసారి గొడవ జరిగింది. భార్య తలను గోడకేసి కొట్టాడు. ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్నాక ఆరు నెలల క్రితం ఓటీటీలో చూసిన ఓ వెబ్ సిరీస్‌లో ఉన్నట్లుగా మృతదేహాన్ని బాత్రూంలోకి తీసుకువెళ్లి ముక్కలుగా నరికాడు.

వెంకటమాధవి హత్య బాలాపూర్ మండలంలోని జిల్లెలగూడలో తీవ్ర అలజడి రేపింది. న్యూ వెంకటేశ్వర నగర్ కాలనీలోని ఓ అపార్టుమెంట్‌లో గురుమూర్తి దంపతులు ఉంటున్నారు. గురుమూర్తి తన భార్యను హత్య చేసినట్లు తెలియగానే, అపార్ట్ మెంట్ లో ఉండే వారంతా ఖాళీ చేసి వెళ్లిపోయారు.
Go Back to Shorts
Hyderabad
Crime News
Telangana
Andhra Pradesh

More Telugu News