రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి సాయం కోసం అర్ధిస్తుంటే.. ఫొటోలు, వీడియోలు తీసుకున్నారు!

Man seriously injured in road accident people enjoyed with taking videos
  • కీసర అవుటర్ రింగ్ రోడ్డు వద్ద ఘటన
  • వెనక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టడంతో కిందపడిన ఏలేందర్
  • బాధితుడి కేకలతో డ్రైవర్ లారీని రివర్స్ చేయడంతో నుజ్జయిన కాళ్లు
  • కాపాడమని ప్రాథేయపడితే చోద్యం చూసిన జనం
  • ఆసుపత్రికి తీసుకెళ్లే లోపే మృతి
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి సాయం కోసం అర్థిస్తుంటే చుట్టూ చేరిన జనం మాత్రం తీరిగ్గా ఫొటోలు, వీడియోలు తీసుకుంటూ.. వాటిని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తూ ఎంజాయ్ చేశారు. సమాచారం అందుకున్న 108 వాహనం వచ్చి ఆసుపత్రికి తరలించే సరికే అతని ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. కీసర అవుటర్ రింగ్ రోడ్డు వద్ద నిన్న జరిగిందీ ఘటన.

పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్‌కు చెందిన వి. ఏలేందర్ (35) కీసర రాంపల్లి చౌరస్తాలో ఉంటున్నారు. నిన్నసాయంత్రం కీసరలో తాను నిర్మిస్తున్న ఇంటిని చూసేందుకు స్కూటీపై బయలుదేరారు. ఈ క్రమంలో వెనక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. రోడ్డపై పడిపోయిన ఏలేందర్ తనను కాపాడాలంటూ అటుగా వెళ్తున్న వారిని చూసి కేకలు వేసి అర్థించారు. గమనించిన లారీ డ్రైవర్ వాహనాన్ని రివర్స్ చేయడంతో ఏలేందర్ కాళ్లు నుజ్జునుజ్జు అయ్యాయి. దీంతో విలవిల్లాడిపోయిన ఏలేందర్ తనను ఆసుపత్రికి తీసుకెళ్లాలని కన్నీటితో వేడుకున్నారు. 

ఆయన కన్నీళ్లు అక్కడున్న వారిని కదిలించలేకపోయాయి. 108కు సమాచారం అందించి అతడిని ఫొటోలు, వీడియోలు తీస్తూ గడిపేశారు. ఆ తర్వాత 108 వాహనం వచ్చి బాధితుడిని ఈసీఐఎల్ చౌరస్తాలోని ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే అతడు చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. లారీ డ్రైవర్ లక్ష్మణ్‌పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Go Back to Shorts
Road Accident
Keesara
Crime News
Hyderabad

More Telugu News