ఉన్నత పదవి ఇప్పిస్తామని నటి దిశాపటానీ తండ్రిని మోసం చేసిన ముఠా

Actress Disha Patani Father Duped Of Rs 25 lakh
  • ప్రభుత్వ కమిషన్‌లో పదవులు ఇప్పిస్తామని రూ.25 లక్షలు తీసుకున్న ముఠా
  • బరేలీ జిల్లా కొత్వాలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన దిశాపటాని తండ్రి
  • ఐదుగురిపై కేసు నమోదు చేసిన పోలీసులు
ప్రముఖ సినీ నటి దిశా పటానీ తండ్రి, రిటైర్డ్ డిప్యూటీ ఎస్పీ జగదీశ్ సింగ్ పటానీని కొంతమంది మోసం చేశారు. ఉన్నత పదవులు ఇప్పిస్తామని చెప్పి ఆయనను ఓ ముఠా మోసం చేసింది. ప్రభుత్వ కమిషన్‌లో మంచి పదవులు ఇప్పిస్తామని చెప్పి రూ.25 లక్షలు తీసుకున్నారు. తాను మోసపోయానని గుర్తించిన జగదీశ్ సింగ్ యూపీలోని బరేలి జిల్లాలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

ఆయనను మోసం చేసిన ముఠాలో ఐదుగురు వ్యక్తులు ఉన్నట్లుగా గుర్తించారు. జగదీశ్ నిన్న సాయంత్రం బరేలి కొత్వాలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

శివేంద్ర ప్రతాప్, దివాకర్ గార్గ్, ఆచార్య జయప్రకాశ్, ప్రీతి గార్గ్, మరొకరిపై కేసు నమోదు చేశామని కొత్వాలి పోలీస్ స్టేషన్ ఇంఛార్జ్ డీకే శర్మ వెల్లడించారు. క్రిమినల్, దోపిడీ కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

జగదీశ్ పటానీ బరేలీలోని సివిల్ లైన్స్ ప్రాంతంలో ఉంటున్నారు. శివేంద్ర ప్రతాప్ సింగ్ తనకు ముందుగానే తెలుసని... ఆయన దివాకర్ గార్గ్, జయప్రకాశ్‌లను పరిచయం చేశారని ఫిర్యాదులో జగదీశ్ పటానీ పేర్కొన్నారు. తమకు బలమైన రాజకీయ సంబంధాలు ఉన్నాయని నిందితులు తనకు చెప్పారని, ప్రభుత్వ కమిషన్‌లో చైర్మన్, వైస్ చైర్మన్ లేదా మరో ప్రాధాన్యత కలిగిన పదవిని ఇప్పిస్తామని హమీ ఇచ్చినట్లు అందులో పేర్కొన్నారు.

మొత్తం రూ.25 లక్షలు ఇచ్చానని, ఇందులో రూ.5 లక్షలు నగదు రూపంలో, మిగిలిన మొత్తం బ్యాంకు ఖాతాల ద్వారా బదిలీ చేసినట్లు పేర్కొన్నారు. మూడు నెలలుగా తనకు పదవి ఇప్పించే అంశంపై ఎలాంటి పురోగతి కనిపించలేదని, దీంతో తాను ప్రశ్నించానని పేర్కొన్నారు. వడ్డీతో సహా తిరిగి ఇస్తామని వారు తనకు చెప్పారని వెల్లడించారు. కానీ వారు ఎంతకూ తన డబ్బును తిరిగి ఇవ్వలేదని పేర్కొన్నారు.
Go Back to Shorts
Crime News
Disha
Bollywood
Uttar Pradesh

More Telugu News