అది తిరుమలలో వీడియో కాదు... మా ఇంట్లో తీసిన వీడియో: మంత్రి గుమ్మిడి సంధ్యారాణి
- తిరుమలలో అపచారం అంటూ ఓ వీడియో వైరల్
- అది తన కొడుకు పుట్టినరోజు వేడుకలు అని వెల్లడించిన మంత్రి
- అది విజయవాడలో తీసిన వీడియో అని స్పష్టీకరణ
ఈ నేపథ్యంలో, ఏపీ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి స్పందించారు. ఆ వీడియో తన ఇంట్లో రికార్డు చేసిందని వెల్లడించారు. విజయవాడలో నా ఇంట్లో... నా కొడుకు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటే... కొందరు తిరుమల పద్మావతి గెస్ట్ హౌస్ అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆ ఏడుకొండల వాడిని పూజించే వ్యక్తిగా, ఒక భక్తురాలిగా చెబుతున్నాను... ఈ విధంగా విష ప్రచారం చేసేవారిని ఆ దేవుడు క్షమించడు అని స్పష్టం చేశారు. ఈ మేరకు తన సందేశంతో కూడిన వీడియోను మంత్రి గుమ్మిడి సంధ్యారాణి విడుదల చేశారు.
"నిన్నటి నుంచి మీ అందరూ ఒక వీడియోను చూస్తున్నారు. సభ్యత, సంస్కారం లేకుండా కొన్ని కుక్కలు... నా కుటుంబాన్ని, నా పిల్లలను, నా భర్తను అవమానపర్చాలన్న ఉద్దేశంతో కొన్ని వీడియోలు, ఫొటోలు పెడుతుండడం అందరూ గమనిస్తున్నారు. ఈ కుక్కలను పట్టించుకోవడం ఎందుకులే అని భావించి, ఈ వీడియోకు సమాధానం చెప్పకూడదు అని అనుకున్నాను. కానీ, నన్ను అభిమానించే కొంతమంది విషయం ఏంటో తెలియక కంగారు పడుతున్నారు. అందుకే వివరణ ఇస్తున్నాను.
ఆగస్టు 29వ తేదీ నా కొడుకు పుట్టినరోజు. ఆ రోజు విజయవాడలో నా ఇంట్లో నా కొడుకు పుట్టినరోజు పార్టీ ఏర్పాటు చేశాం. మా కుటుంబ సభ్యులం అందరం కలిసి భోజనాలు చేశాం, పిల్లలు డ్యాన్సులు చేశారు. ఆ తర్వాత 31వ తేదీన తిరుమల కొండను కాలినడకన ఎక్కాం. సెప్టెంబరు 1వ తేదీ ఉదయం శ్రీవారిని దర్శించుకున్నాం. వరదల కారణంగా ఆ రోజు రాత్రికే విజయవాడ వచ్చేశాను.
తిరుమలలోని పద్మావతి గెస్ట్ హౌస్ లో నేను ఉన్న సందర్భాలే లేవు. నేను గానీ, నా కుటుంబం గానీ, నా అనుచరులు గానీ, నా స్టాఫ్ గానీ పద్మావతి గెస్ట్ హౌస్ లో బస చేయలేదు.
అమ్మవారిని కొలిచే భక్తురాలిగా, ముత్యాలమ్మ తల్లి జాతరను జరిపించే వంశంలో పుట్టిన ఆడబిడ్డగా చెబుతున్నాను... తిరుమలలో అలాంటి పిచ్చి పనులు, పనికిమాలిన పనులు ఎవరు చేస్తారో మీ అందరికీ తెలుసు. నిజంగా అలాంటి పనులు చేసి, ఆ దేవుడ్ని అవమానపరిచిన వాళ్లు ఏమైపోయారో మీ అందరికీ తెలుసు.
ఆ గోవింద నామాలు జపించే వ్యక్తిగా చెబుతున్నాను... నిజంగా ఈ వీడియో వైరల్ చేసిన వాడు ఎవడో గానీ, ఆ కుక్కలు ఎవరో గానీ... మీకు నిజాలు తెలుసో లేదో నాకు తెలియదు... భగవంతుడు మాత్రం మీకు చూపిస్తాడు" అంటూ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి స్పష్టం చేశారు.