దులీప్ ట్రోఫీలో రిషభ్పంత్ వీరబాదుడు.. టీమిండియా కెప్టెన్సీ ఖాయమేనా?
- దులీప్ ట్రోఫీలో ఇండియా-బీ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న పంత్
- ఇండియా ఏ జట్టుపై రెండో ఇన్నింగ్స్లో 47 బంతుల్లో 61 పరుగులు చేసిన ఇండియా స్టార్
- ప్రశంసలు కురిపించిన టీమిండియా మాజీ ఓపెనర్ డబ్ల్యూవీ రామన్
ఇండియా-బీ జట్టుకు అభిమన్యు ఈశ్వరన్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. అయినప్పటికీ మైదానంలో బౌలర్లతో ఎక్కువగా పంతే మాట్లాడుతున్నాడు. బంతిని ఎలా సంధించాలి? ఎక్కడ సంధించాలి అన్న విషయాలు చెబుతూ అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తున్నాడు. పంత్తో మాట్లాడిన తర్వాత పేసర్ నవదీప్ సైనీ.. ధ్రువ్ జురెల్ వికెట్ నేలకూల్చాడు.
ఈ మ్యాచ్కు కామెంట్రీ చెప్పిన టీమిండియా మాజీ ఓపెనర్ డబ్ల్యూవీ రామన్.. పంత్ ఆటతీరుపై ప్రశంసలు కురిపించాడు. అతడి వ్యూహాలు అద్భుతమని కొనియాడాడు. కెప్టెన్ ఎవరైనా.. మైదానంలో మాత్రం రిషభ్ పంతే లీడరని చెప్పుకొచ్చాడు. మైదానంలో సైనీకి పంత్ ఇచ్చిన సలహా స్టంప్స్ మైక్లో రికార్డయిందని, అది తాను విన్నానని చెప్పుకొచ్చాడు. రామన్ వ్యాఖ్యలతో టీమిండియా తదుపరి కెప్టెన్సీకి అతడు అర్హుడేనన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. నెటిజన్లు కూడా రామన్ వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నారు.